
నల్గొండ జిల్లా మిర్యాలగూడాలో హత్యకు గురైన ప్రణయ్ కుటుంబ సభ్యులను మంత్రి జగదీష్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు జగదీష్ రెడ్డి. ప్రణయ్ హత్య కేసు హేయనీయమన్నారు మంత్రి.. అందుకే హత్య కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది అన్నారు. నిందితులను త్వరగా అరెస్ట్ చేసిన పోలీసులకు అభినందనలు తెలిపారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదన్నారు. ప్రభుత్వం తరుపున 8 లక్షల 25 వేల నగదు శాంక్షన్ కాగా.. ప్రస్తుతం 4 లక్షలు చెక్కు ఇచ్చామని.. మిగతాది కేసు విచారణ సమయంలో ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. ప్రణయ్ భార్య అమృతకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం.. వ్యవసాయ యోగ్యమైన భూమి, ఇళ్లు ఇస్తామన్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడే వారిని సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపు ఇచ్చారు. అలాగే కేసు త్వరితగతిన పూర్తి చేసి.. నిందితులకు శిక్ష పడేలా పోలీసులు చూడాలన్నారు. ప్రణయ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూమతిని తెలిపారు జగదీష్ రెడ్డి..