హెచ్ఐవీ ఉందంటూ తప్పుడు రిపోర్ట్.. షాక్కు గురై మహిళ మృతి
ప్రైవేట్ క్లినిక్ వైద్యుడి నిర్వాకం ఓ మహిళ ప్రాణాలను తీసింది. ఆ డాక్టర్ ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ కారణంగా ఆ మహిళ షాక్కు గురై మృతి చెందింది. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. రోహ్రు ప్రాంతానికి చెందిన ఒక మహిళ అనారోగ్యానికి గురైంది. దీంతో సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు క్లినిక్కు వెళ్లింది. ఆమెను పరిక్షించిన డాక్టర్.. కొన్ని టెస్టులు చేయించమన్నాడు. వాటి తాలుకు రిపోర్టులను ఆమెకు ఇచ్చాడు. కానీ అందులో ఏముందో చెప్పలేదు. ఆ రిపోర్ట్లను తీసుకుని ఆమె తన భర్తతో కలిసి సిమ్లాలోని కమలానెహ్రూ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళింది. రిపోర్టులను చూసిన
వైద్యులు ఆమెకు హెచ్ఐవి ఉన్నట్లుగా చెప్పారు. మరోసారి టెస్టులు చేసుకోవాలని అన్నారు. కానీ తనకు హెచ్ఐవీ ఉందని తెలిసిన వెంటనే ఆ మహిళ షాక్కు గురై కోమాలోకి వెళ్లిపోయింది.
దీంతో ఆమెను ఇందిరాగాంధీ మెడికల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఐసీయూలో వెంటిలేటర్పై ఉన్న ఆమె మంగళవారం మృతి చెందింది. కానీ అవిడకు వచ్చిన ఆ రిపోర్ట్లు తప్పని ఆ తర్వాత వైద్యులు నిర్ధారించారు. కానీ అప్పటికే లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ శాసనసభను కుదిపేసింది. దీంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మృతురాలి కుటుంబానికి పరిహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com