ఆరు నెలల్లో ఎంత సంపాదనో.. 7గురు లక్ష్మీ పుత్రుల సంపద ఎంతో తెలిస్తే..

ఆరు నెలల్లో ఎంత సంపాదనో.. 7గురు లక్ష్మీ పుత్రుల సంపద ఎంతో తెలిస్తే..

డబ్బు ఒక రేంజ్ వరకే సంపాదించాలి.. ఆ తరువాత దానంతట అదే పెరుగుతుంది.. జీవితాంతం కష్టపడక్కర్లేదు.. ఐడియాలజీనే పెట్టుబడిగా పెడుతూ కోట్లు సంపాదించొచ్చు. కోట్లేం ఖర్మ మిలియనీర్లు.. బిలియనీర్లు కూడా అయిపోవచ్చు. అలాంటి జాబితాలోకే వస్తారు మన దేశ లక్ష్మీ పుత్రులు ఈ 7గురు ధనవంతులు.

2019 తొలి అర్ధభాగంలో మార్కెట్లు సంపాదించిన దానిలో ముప్పావు శాతం కంటే ఎక్కువగా దేశీ బిలియనీర్లు సంపాదించేశారు. దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలోని తొలి 5 గురు దాదాపు ఈ 6 నెలల్లో రూ. 1 లక్ష కోట్ల సంపదను ఆర్జించారు. మొత్తం మీద చూస్తే.. ఈ బిలయనీర్స్ దాదాపు 20 బిలియన్ డాలర్ల సంపదను (రూ. 1,40,000 కోట్లు) తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదే సమయంలో మార్కెట్లు సృష్టించిన సంపదలో ఇది 80శాతం కావడం గమనార్హం. స్టీల్ దిగ్గజం లక్ష్మీ మిట్టల్ ను మినహాయిస్తే... మిగతా 7గురు తలా 1.7 బిలియన్ డాలర్ల(రూ.12,000 కోట్లు) చొప్పున ఆర్జించారు.

దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ ఈ 2019 తొలి 6 నెలల్లోనే తన రిలయన్స్ ఇండస్ట్రీస్ ద్వారా 7.41 బిలియన్ డాలర్లను సంపాదించారు. అంటే దాదాపు రూ. 50,000 కోట్ల ను ఆర్జించారు ముఖేష్ అంబానీ. దీంతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ముఖేష్ అంబానీ 12 వ స్థానంలో నిలిచారు. RIL (రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ) షేర్లు ఈ సంవత్సరం తొలి 6 నెలల్లో దాదాపు 14శాతం పెరిగాయి. ఇక విప్రో అధినేత , వితరణ శీలి అయిన ప్రేమ్‌జీ నాడర్ గత నెలలో విప్రోలోని మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసినా.. ఆయన ఈ 2019 తొలి అర్ధభాగంలో దాదాపు 4.73 బిలియన్ డాలర్లను సంపాదించారు. మొత్తం మీద 21.7 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ ధనవంతుల జాబితాలో 44 స్థానంలో ఉన్నారు. విప్రో షేర్లు సెన్సెక్స్ పడుతున్న సమయంలోనూ రాణించి 13.6శాతం వృద్ధిని కనబరిచాయి.

ప్రైవేటు రుణ రంగంలో నాలుగో అగ్రగామిగా ఉన్న కోటక్ మహీంద్ర బ్యాంక్ అధినేత ఉదయ్ కోటక్ ఈ సంవత్సరం తొలి 6 నెలల్లో 2.08 బిలియన్ డాలర్లను ఆర్జించారు. మొత్తం మీద ఆయన సంపద 13.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. కోటక్ మహీంద్ర బ్యాంక్ షేర్ వాల్యూ దాదాపు 20శాతం పెరగడం గమనార్హం.

ప్రముఖ కంపెనీ అయిన HCL టెక్నాలజీస్ అధినేత శివనాడార్ కూడా ఈ 2019 తొలి అర్ధభాగంలో దాదాపు 1.5బిలియన్ డాలర్లను ఆర్జించారు. ఈ 6 నెలల్లో HCL స్టాక్స్ దాదాపు 11శాతం పెరిగాయి. ఇక మిగతా వారి జాబితాలోని అదానీ గ్రూప్ ప్రమోటర్ గౌతమ్ అదానీ, శ్రీ సిమెంట్ అధినేత వేణు గోపాల్ బంగర్, వేదాంత గ్రూప్ ప్రమోటర్ అనిల్ అగర్వాల్ లు దాదాపు 1.5 - 1.7 బిలియన్ డాలర్ల సంపదను ఆర్జించారు. ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ అధినేత లక్ష్మీ మిట్టల్ మాత్రం ఈ ఏడాది తొలి అర్ధభాగంలో నష్టాలను చవి చూశారు. ఆయన సంపదలో దాదాపు 881 మిలియన్ డాలర్ల సంపద హరించుకుపోయింది. మొత్తం మీద లక్ష్మీ మిట్టల్ ఆస్తి 12.91 బిలియన్ డాలర్లుగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story