వినియోగదారులకు భారీ షాక్.. కేజీ ఉల్లిపాయలు ఎంతో తెలుసా?
ఉల్లి ధర మరింత ఘాటెక్కింది. హోల్సేల్ మార్కెట్లో రికార్డు స్థాయి ధరలతో మంటెక్కిస్తోంది. హైదరాబాద్ మలక్పేట్లోని వ్యవసాయ మార్కెట్లో నంబర్ వన్ రకం మహారాష్ట్ర ఉల్లి.. నిన్న వేలం పాటలో క్వింటాలు 8వేల 800 పలికింది. ఇక్కడ కిలో ఉల్లి 88 పలుకగా.. సెకండ్, థర్డ్ గ్రేడ్ రకాలు 75, 65 రూపాయల చొప్పున ఉన్నాయి. హోల్సేల్ మార్కెట్లోనే ఈ ధరలు ఉంటే రిటైల్ మార్కెట్లలో ధర పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. రిటైల్ మార్కెట్లో నంబర్ వన్ రకం ఉల్లి వందకు చేరింది.
మామూలుగా మలక్పేట మార్కెట్కు రోజూ కనీసం 14 వేల క్వింటాళ్ల నుంచి 15 వేల క్వింటాళ్ల ఉల్లి వస్తుంది. అలాంటప్పుడే రైతులు, వ్యాపారులకు, ఇటు వినియోగదారులకు ధర అందుబాటులో ఉంటుంది. మలక్పేట మార్కెట్కు శుక్రవారం వచ్చింది 8వేల 854 క్వింటాళ్లే. ఇందులో 800 క్వింటాళ్లు మహారాష్ట్ర నుంచి రాగా.. కర్ణాటక నుంచి 3వేల క్వింటాలు, కర్నూలు, మహబూబ్నగర్ నుంచి 5వేల క్వింటాళ్ల వరకూ వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్లో రిటైల్లో ఎక్కువగా అందుబాటులో ఉన్నది మహబూబ్నగర్, కర్నూలు ఉల్లి రకాలే. వీటిని వ్యాపారులు 70 నుంచి 80 చొప్పున విక్రయిస్తున్నారు.
గిరాకీకి తగినట్టుగా సరఫరా లేకపోవడమే ఉల్లి సమస్యకు కారణం. వర్షాలతో పంట బాగా దెబ్బతినడంతో గుజరాత్, రాజస్థాన్ నుంచి మలక్పేట మార్కెట్కు సరుకు రాలేదు. మహారాష్ట్రలోని నాసిక్, తెలంగాణలోని నారాయణఖేడ్, కొల్లాపూర్ నుంచి సరుకు రావడం పెరిగితే.. ధర కొంత తగ్గే అవకాశముంది. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి డిసెంబరు మొదటివారంలో డిమాండ్కు తగినట్టుగా వచ్చేవరకు ధర కిలో వంద వరకు కొనసాగే అవకాశముందని వ్యాపారులు భావిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com