తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారు : లక్ష్మణ్
తెలంగాణలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు కోసం ఆందోళనలు ముమ్మరం చేయాలని నిర్ణయించింది బీజేపీ. దశల వారీగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. తెలంగాణలో ఇటీవల మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోవడానికి మద్యమే కారణమని బీజేపీ ఆరోపించింది. మహిళా సంకల్ప దీక్ష పేరుతో ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ఆ పార్టీ నేత డీకే అరుణ చేపట్టిన 2 రోజుల దీక్షను లక్ష్మణ్ ప్రారంభించారు.
బ్రాండ్ హైదరాబాద్ కాస్తా ఇప్పుడు బ్రాందీ హైదరాబాద్గా మారిపోయిందన్నారు లక్ష్మణ్. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సామాజిక బాధ్యతగా వహించి మద్యాన్ని నియంత్రించాలని డిమాండ్ చేశారు.
దిశ, మానస, సమత ఘటనలన్నింటికీ లిక్కరే కారణమన్నారు డీకే అరుణ. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కేసీఆర్ మర్చిపోయారని ఆరోపించారు. రాష్ట్రంలోని అనేక కుటుంబాలు మద్యం వల్లే చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ పోరాటం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేసింది బీజేపీ. పొరుగు రాష్ట్రమైన ఏపీలో మాదిరిగా మద్యపాన నిషేధానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. రాష్ట్రంలో విచ్చలవిడిగా వెలిసిన బెల్ట్షాపుల్ని ధ్వంసం చేయాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com