కరోనా వైరస్‌ను గుర్తించిన వైద్యుడు మృతి

కరోనా వైరస్‌ను గుర్తించిన వైద్యుడు మృతి

చైనాలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. మనుషుల ప్రాణాలను కబళిస్తోంది. చైనా వ్యాప్తంగా కరోనా వైరస్‌ మరణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కరోనా వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇప్పటివరకూ మొత్తంగా 563కు చేరుకుంది. గురువారం ఒక్క రోజు 75 మంది చనిపోయారు. ఈ వ్యాధి సోకినట్లుగా నిర్ధారణ అయిన వారి సంఖ్య దాదాపు 30 వేలకు చేరిందని అంచనా వేస్తున్నారు. దేశంలోని దాదాపు 31 ప్రావిన్సుల పరిధికి వ్యాధి విస్తరించిందని అధికారులు భావిస్తున్నారు. 10రోజుల్లో ఆసుపత్రిని కట్టిన చైనా వుహాన్‌లో మరో ఆసుపత్రినికి కట్టింది. 1500 పడకలున్న ఈ ఆసుపత్రిలో త్వరలో వైద్యసేవలు ప్రారంభంకానున్నాయి. వుహాన్‌ సిటీ నుంచి ఢిల్లీకి చేరుకున్న 645 మందిలో ఏ ఒక్కరికీ వైరస్‌ సోకలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

వైరస్‌ వ్యాప్తిపై చైనా దేశ ప్రజలను అప్రమత్తం చేసిన ఎనిమిదిమంది వైద్యుల్లో ఒకరైన లీ వెన్‌లియాంగ్‌ చివరికి అదే వ్యాధితో కన్నుమూశారు. గత డిసెంబర్‌లో వుహాన్‌లోని వైద్య కళాశాలకు వచ్చిన రోగుల్లో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించిన ఈయన తన సన్నిహితులను అప్రమత్తం చేయడానికి వుయ్‌చాట్‌ ఆప్‌లో ఆ వివరాలను ఉంచారు. చివరికి ఆ మెసేజీ ద్వారా అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. దీంతో ప్రభుత్వం వదంతులను వ్యాపింపజేస్తున్నారంటూ లీపై కక్షకట్టింది. చివరికి డాక్టర్‌ లీకి కూడా ప్రాణాంతక వైరస్‌ సోకి పరిస్థితి విషమించడంతో వుహాన్‌లో కన్నుమూశారు.

Tags

Read MoreRead Less
Next Story