మండలి రద్దు బిల్లుపై ఢిల్లీలో పరిణామాలతో డీలా పడ్డ వైసీపీ ముఖ్యనేతలు

మండలి రద్దు బిల్లుపై ఢిల్లీలో పరిణామాలతో డీలా పడ్డ వైసీపీ ముఖ్యనేతలు

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుపై వేచి చూసే ధోరణిలోనే కేంద్రం ఉన్నట్టుగా కనిపిస్తోంది. మార్చి 3 నుంచి జరిగే రెండో విడత పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాల్లో పెట్టే బిల్లులు, ఇతర అంశాలపై చర్చించేందుకు నిన్న ఢిల్లీలో అధికారుల స్థాయిలో కీలక సమావేశం జరిగింది. ఉభయసభల్లో పెట్టే లిస్ట్ ఆఫ్ బిజినెస్‌పై సుదీర్ఘంగా చర్చించారు. ఐతే.. ఈ మీటింగ్‌లో ఏపీ శాసన మండలి రద్దు అంశం చర్చకు రాలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఢిల్లీలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే.. వచ్చే పార్లమెంట్ సెషన్‌లో ఏపీ మండలి రద్దు బిల్లు పెట్టే అవకాశం లేదు. దీన్ని బట్టి చూస్తే ఇక అది అటకెక్కినట్టేనన్న వాదన వినిపిస్తోంది. ఇది YCPకి షాక్‌ అనే చెప్పాలి.

ఇటీవలే 2 సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్‌ ప్రధాని మోదీతోనూ, హోంమంత్రి అమిత్‌షాతోనూ మండలి రద్దు బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందేలా చూడాలని కోరారు. 3 రాజధానుల అంశంతోపాటు మండలి రద్దు బిల్లుపైనా ప్రత్యేకంగా చర్చించారు. కానీ ఈ విజ్ఞప్తుల్ని కేంద్రం సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించడం లేదని, ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే అదే అర్థమవుతోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఐతే.. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినందున కొంచెం ఆలస్యమైనా సరే కేంద్రం దీనిపై నిర్ణయం తీసుకుంటుందని BJP నేతలు చెప్తున్నారు. ఈ పరిణామాలు మాత్రం YCP నేతలకు మింగుడు పడడం లేదు. 3 రాజధానుల బిల్లును మండలి సెలక్ట్ కమిటీకి పంపిన నేపథ్యంలో మండలి రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. మండలే లేకపోతే తమ నిర్ణయం తక్షణం అమలుకు ఇబ్బంది ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో మండలి రద్దు బిల్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో పడితే తల కొట్టేసినట్టుగా ఫీలవుతున్నారు జగన్ పార్టీ నేతలు.

ఎన్ని విజ్ఞప్తులు చేసినా, రాజ్యసభలో కేంద్రానికి సహకరిస్తామని హామీలు ఇచ్చినా మండలి రద్దు బిల్లుపై చకచకా అడుగులు పడడం లేదన్న వార్తలు YCPకి మింగుడుపడడం లేదు. ప్రస్తుతం ఖరారైన లిస్ట్ ఆఫ్ బిజినెస్‌లో మండలి రద్దు బిల్లు లేకపోయినా.. కావాలనుకుంటే సప్లిమెంటరీ అజెండాగానో, టేబుల్‌ ఐటమ్‌గానో దీన్ని తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలాంటి వాటిపైనే ఇప్పుడు YCP ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం కేంద్రం వద్ద వివిధ రాష్ట్రాల నుంచి మండలి రద్దు తీర్మానాలు, మండలి ఏర్పాటు కోరుతూ చేసిన తీర్మానాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీనిపై ఒక జాతీయ విధానం తీసుకునే దిశగా BJP ఆలోచిస్తోందా లేదంటే.. ప్రస్తుత సెషన్‌లో కీలకమైన బిల్లులపై తప్ప వేరేవి పరిగణనలోకి తీసుకోవడం లేదా అనేదానిపై ఒకట్రెండు రోజుల్లోనే స్పష్టత వస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story