అమిత్షాను కలవనున్న అమరావతి రైతులు

రాజధాని అమరావతిపై కేంద్రం జోక్యం చేసుకునే సమయం వచ్చిందా..? తాజా పరిస్థితులు చూస్తే ఔననే అనిపిస్తోంది. ఈ నెల 15న రాజధాని రైతులు కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలవనున్నారు. హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా షా తో వీరి అపాయింట్మెంట్ ఖరారైనట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ద్వారా రైతులు అమిత్షాను కలిసేందుకు ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి చేసిన ప్రయత్నాలు ఫలించడంతో ఈ మీటింగ్ జరగబోతోంది. రాజధాని మార్పును అడ్డుకోవాలని, ఈ అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని అమరావతి 29 గ్రామాల ప్రజలు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల ఈ అంశంపై ఇంత వరకూ ఆచితూచి వ్యవహరించిన కేంద్రం.. త్వరలోనే యాక్షన్ ప్లాన్ అమలు చేస్తుందని కూడా BJP నేతలు చెప్తున్నారు. రాజధాని అమరావతికి తామంతా కట్టుబడి ఉన్నామని AP BJP చీఫ్ కన్నా సహా ముఖ్యనేతలంతా స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు అమిత్షాతో రైతుల భేటీ తర్వాత వారికి భరోసా దొరుకుతుందంటున్నారు. ఈ నెల 15న అమిత్షాతో భేటీలో అన్ని విషయాలు వివరిస్తామంటున్నారు రైతులు.
అమరావతే రాజధానిగా ఉండాలంటూ రైతుల ఉద్యమం 77వ రోజుకు చేరింది. మందడం, తుళ్లూరుల్లో మహాధర్నాలు కొనసాగుతుంటే, వెలగపూడిలో రిలే దీక్షలు చేస్తున్నారు. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో ధర్నాల్లో వేల మంది మహిళలు పాల్గొంటున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎదుర్కొంటామంటున్నారు. హక్కుల కోసం పోరాడుతుంటే వందలాది మందిపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటున్నారు రైతులు. 3 రాజధానుల ప్రకటన వెనక్కి తీసుకునే వరకూ ఉద్యమం ఆగబోదని స్పష్టం చేశారు.