వణికిస్తున్న కరోనా.. 24 గంటల్లో 100 మంది మృతి
కరోనా వైరస్తో స్పెయిన్ విలవిల్లాడుతోంది. మిగిలిన దేశాలతో పోలిస్తే.. అన్నింటికంటే వేగంగా స్పెయిన్లోనే వ్యాపిస్తోంది. 24 గంటల్లో ఏకంగా వందమంది ప్రాణాలు కోల్పోడం ఆ దేశాన్ని కలవరపెడుతోంది. ఇక, కరోనా వైరస్తో బాధపడుతున్న వారి సంఖ్య 7,753కు పెరిగింది. కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 288కి చేరుకుంది. స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంషెజ్ భార్య బెగోనా గోమెజ్కు కూడా కరోనా వైరస్ సోకినట్టు పరీక్షల్లో తేలింది. ప్రస్తుతం వారిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నట్టు అధికారులు తెలిపారు.
చైనా తర్వాత అత్యధికంగా ప్రభావితమైన దేశం ఇటలీ కాగా, స్పెయిన్ ఇప్పుడు మూడో స్థానంలోకి వచ్చింది. యూరప్లో రెండోది. కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించింది. ఉద్యోగం, ఆహారం, చికిత్స కోసం తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని నిషేదాజ్ఞలు జారీ చేసింది.
కరోనా వైరస్ ప్రబలకుండా అడ్డుకట్టే వేసే ఉద్దేశంతో స్పెయిన్ ప్రభుత్వం అధికారికంగా ఎమర్జెన్సీ ప్రకటించింది. 1975లో స్పెయిన్ డిక్టేటర్ ఫ్రాన్సిస్కో ఫ్రాన్కో మరణం తర్వాత దేశంలో ఇలా అత్యవసర పరిస్థితి విధించడం ఇది రెండోసారి. 2010లో ఎయిర్ట్రాఫిక్ కంట్రోలర్ల సమ్మె కారణంగా ఒకసారి ఎమర్జెన్సీ విధించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఎమర్జెన్సీ విధించారు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com