కేసీఆర్‌ చెప్పిన హెలికాఫ్టర్‌ మనీపై ప్రపంచవ్యాప్తంగా చర్చ.. ఓ అడుగు ముందుకేసిన న్యూజిలాండ్

కేసీఆర్‌ చెప్పిన హెలికాఫ్టర్‌ మనీపై ప్రపంచవ్యాప్తంగా చర్చ.. ఓ అడుగు ముందుకేసిన న్యూజిలాండ్

ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పిన హెలికాఫ్టర్‌ మనీపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సంక్షోభ సమయాల్లో తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకునేలా ప్రజలకు నేరుగా డబ్బును అందించే విధానాన్నే హెలికాప్టర్‌ మనీ అంటారు. డిమాండ్‌తో పాటు ద్రవ్యోల్బణం పెంచే ఉద్దేశంతో కేంద్రీయ బ్యాంక్‌ ఒకేసారి డబ్బు సరఫరాను పెంచి ప్రభుత్వం ద్వారా నేరుగా ప్రజలకు అందజేస్తుంది.

కరోనాతో ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు అనేక దేశాలు ఉద్దీపన చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా న్యూజిలాండ్ మరో అడుగు ముందుకు వేసింది. తమ ప్రజలకు నేరుగా డబ్బును అందించే ‘హెలికాప్టర్‌ మనీ’ విధానాన్ని పరిశీలిస్తున్నామన్నారు న్యూజిలాండ్‌ ఆర్థిక మంత్రి గ్రాంట్‌ రాబర్ట్‌సన్‌. అయితే అది కేంద్రీయ బ్యాంక్‌ ద్వారా ముద్రించి పంచిపెడుతుందా? లేదా ప్రభుత్వం రుణాల ద్వారా సేకరించి ఈ డబ్బును అందుబాటులోకి తెస్తుందా? అని ప్రశ్నకు ప్రస్తుతం ఇది సంప్రదింపుల దశలోనే ఉందన్నారు ఆర్థిక మంత్రి. ఇది ఏవిధంగా ఉంటుందనే విషయంపై ఇంకా సుదీర్ఘ చర్చ జరగలేదని బదులిచ్చారు. అయితే, ఈ విధానంలో ప్రభుత్వానిదే కీలక పాత్ర ఉంటుందని రాబర్ట్‌సన్‌ అభిప్రాయపడ్డారు.

కరోనా కట్టడికి తీసుకున్న కఠిన చర్యల కారణంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుత త్రైమాసికంలో దాదాపు 21.8శాతం కుచించుకుపోయిన ఆర్థిక వ్యవస్థకు ఈ విధానం వరంగా మారుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే ఈ భారీ నష్టం నుంచి బయటపడేందుకు ఇప్పటికే రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ న్యూజిలాండ్‌ అధికారిక నగదు రేటును భారీగా తగ్గించింది. అంతేకాకుండా బాండ్లను కొనుగోలు చేసే కార్యక్రమాన్ని రెట్టింపు చేసింది. ఈ సమయంలో హెలికాప్టర్‌ విధానం ద్వారా అందుబాటులోకి వచ్చే డబ్బు ఎగుమతి ఆధారిత ఆర్థికవ్యవస్థ కలిగిన న్యూజిలాండ్‌కు ఎంతో దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

హెలికాప్టర్‌ మనీ విధానంతో కేంద్రీయ బ్యాంక్‌ స్వతంత్రతకు ముప్పుతో పాటు సుదీర్ఘకాలం ద్రవ్యోల్బణం కొనసాగే ప్రమాదం ఉన్నందున చాలా ధనిక దేశాలు కూడా దీన్ని అమలుచేయడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story