సలాం ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌

సలాం ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌

సలాం ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్‌తో సలాం న్యాయ పోరాట సమితి పిలుపునిచ్చిన చలో అసెంబ్లీ ఉద్రిక్తంగా సాగింది. పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేశారు. ఈ పోరాటానికి మద్దతు ప్రకటించిన సంఘాల ప్రతినిధులు, పార్టీల నేతల్ని హౌస్ అరెస్టు చేశారు. అబ్దుల్‌ సలాం పోరాట సమితి నేత ఫారూఖ్‌ షుబ్లీని ఇంటి నుంచి బయటకు రానీయలేదు. టీడీపీ నేతలు మహ్మద్‌ ఫతా ఉల్లాహ్‌ను అరెస్ట్‌ చేసి... టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

ఇటు విజయవాడలో టీడీపీ సీనియర్‌నేత వర్ల రామయ్య, గుంటూరులో టీడీపీ నేతలు మన్నవ సుబ్బారావు, నజీర్‌ అహ్మద్‌, ముస్లిం లీగ్‌ పార్టీ నేత బషీర్‌ అహ్మద్‌, బీసీ సంఘం నేత వరప్రసాద్‌ను, నెల్లూరులో టీడీపీ సీనియర్‌నేత అబ్దుల్‌ అజీజ్‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. గుంటూరులో ఎమ్మెల్యే ముస్తఫా ఆఫీస్‌ ముట్టడికి యత్నించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల నేతల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అలాగే సలాం కేసును సీబీఐకి అప్పగించే వరకు పోరాటం ఆగదని టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా స్పష్టం చేశారు. చలో అసెంబ్లీ నేపథ్యంలో విజయవాడలో నాగుల్‌ మీరాను పోలీసులు హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వం పోలీసుల ద్వారా పోరాటాన్ని అడ్డుకుంటోందని ఆయన మండిపడ్డారు.

డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై విజయవాడ ఎంపీ కేసినేని నాని విమర్శలు గుప్పించారు. డీజీపీ గౌతమ్‌ సవాగ్‌ రాష్ట్రాన్ని జైలుగా మార్చారని మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాల్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సలాం కుటుంబానికి న్యాయం చేయాలని కోరితే.. అందరినీ గృహనిర్బంధం చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అందరికీ అండగా ఉంటుందని... సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

సలాం కుటుంబానికి న్యాయం కోసం పోరాడుతుంటే.. ప్రభుత్వం అణగదొక్కుతుందని పలువురు నేతలు ఆరోపించారు. పోలీసులతో అడ్డుకోవడం దారుణమన్నారు. సలాం కేసును సీబీఐకి అప్పగించాల్సిందేనని పట్టుబడుతున్నారు ముస్లీం సంఘాల నాయకులు.

Tags

Read MoreRead Less
Next Story