Ap High Court : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ..!
Ap High court (File photo)
Ap High Court : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జీవో నం-2ను సస్పెండ్ చేస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. పంచాయతీ సర్పంచ్లు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ జారీ చేసిన జీవో విషయంపై అప్పట్లోనే కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. పంచాయతీ కార్యదర్శులకు ఉన్న DDO పవర్ రద్దు చేయడాన్ని నిరసిస్తూ వారంతా పోరాడుతూనే ఉన్నారు. కార్యదర్శల బాధ్యతలు VROలకు ఇవ్వడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ జీవో నంబర్ 2ను సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా తురకపాలెం సర్పంచ్ కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన కోర్టు.. జీవో 2ను సస్పెండ్ చేస్తూ తీర్పు ఇచ్చింది.
గ్రామ సర్పంచ్లకు ఉన్న హక్కుల్ని ఈ జీవో నంబర్-2 నిర్వీర్యం చేస్తోందని, ఇది 73వ రాజ్యాంగ నిబంధనకు విరుద్ధమని సర్పంచ్ తరపున అడ్వొకేట్ వాదనలు వినిపించారు. గ్రామాల అభివృద్ధి విషయంలో సర్పంచ్ల అధికారాలను నిలువరించే ఇలాంటి జీవోను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. వాదనల తర్వాత జీవోను సస్పెండ్ చేస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదావేసింది. దీనిపై ప్రభుత్వం అప్పీల్కు వెళ్తుందా, ఏం చేస్తుంది అనేదానిపై త్వరలోనే స్పష్టత రానుంది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తరచూ కోర్టుల్లో తిరస్కారానికి గురవుతున్నాయంటే అది పాలనావైఫల్యమే అవుతుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు న్యాయ సమీక్ష ముందు అది నిలబడుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలని కానీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే కోర్టులో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయనే వాదన వినిపిస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com