Chandrababu : గజదొంగలు ఆశ్చర్యపోయేలా జగన్ ప్రజలను దోచుకుంటున్నారు : చంద్రబాబు
Chandrababu (tv5news.in)
Chandrababu : గజదొంగలు కూడా ఆశ్చర్యపోయేలా జగన్ రెడ్డి ప్రజలను దోచుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. అమరావతిలో పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర పురోభివృద్ధికి అత్యంత కీలకమైన విద్యుత్ రంగాన్ని జగన్ వ్యక్తిగత అజెండాతో సర్వనాశం చేస్తున్నారన్నారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని ప్రమాణ స్వీకార సభలో ప్రకటించారని.....కానీ మూడేళ్లలోనే 42వేల కోట్లు విద్యుత్ భారాల్ని ప్రజలపై మోపారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలో విద్యుత్ రేట్లు చూసి పరిశ్రమలు ముందుకు వచ్చే పరిస్థితి లేదన్నారు. పరిశ్రమలు లేకపోవడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు.
పెట్రోల్, డీజిల్, ఆస్తి పన్ను, చెత్త పన్ను, ఇసుక, సిమెంట్, మద్యం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఆర్థికంగా కుంగిపోయారన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతుంటే.. విద్యుత్ చార్జీలు పెంచుతూ, పన్నులు వేస్తూ జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు చంద్రబాబు.జగన్ అధికారంలోకి వచ్చాక.. సౌర, పవన విద్యుత్ రంగాన్ని దెబ్బతీశారని విమర్శించారు చంద్రబాబు. సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను రద్దు చేశారన్నారు. 7 సార్లు విద్యుత్ చార్జీల పెంపుతో ఇళ్లల్లో స్విచ్ వేయాలంటే ప్రజలు భయపడే పరిస్థితులు తెచ్చారంటూ మండిపడ్డారు. జగన్ అసమర్థత, చేతకానితనంతో మిగులు విద్యుత్తో ఉన్న రాష్ట్రాన్ని లోటు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా మారిందన్నారు. అప్రకటిత విద్యుత్ కోతలతో రాష్ట్రంలో చీకట్లు కమ్మేలా చేశారంటూ ఫైర్ అయ్యారు.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ను ప్రభుత్వం వదులుకోవడం విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు దారి తీస్తుందని..... 960 మెగావాట్ల పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డి వ్యక్తిగత అజెండాతో, నిరాధారమైన ఆరోపణలతో విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. నాడు దూర దృష్టితో విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేస్తే.. ఇవాళ పక్షపాత ధోరణితో వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేశారన్నారు చంద్రబాబు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com