Chandrababu Naidu : ఏపీలో అరాచకం పరాకాష్టకు చేరింది..!
Chandrababu Naidu : ఏపీలో అరాచకం పరాకాష్టకు చేరిందని టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రజా దేవాలయం లాంటి పార్టీ ఆఫీసుపై వైసీపీ కార్యకార్తలు చేసింది ఉగ్రదాడి కాదా అని ప్రశ్నించారు. దాడి చేసిన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. పోలీసుల తీరుపైనా తీవ్రస్థాయిలో మండిపడిన చంద్రబాబు.. టీడీపీ నేతలపై దాడులు జరిగితే సాక్ష్యాలు అడుగుతున్నారని ఆరోపించారు. పోలీసులే దగ్గరుండి దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్రెడ్డి పాలనలో ఏపీ డ్రగ్స్కు కేరాఫ్గా మారిందని ధ్వజమెత్తారు. గంజాయి ప్రజల జీవితాలను నాశనం చేస్తోందన్నారు. ఎక్కడా లేదని మద్యం బ్రాండ్లు ఏపీలో ఉన్నాయన్నారు. ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నిస్తుంటే దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం తెలంగాణ సీఎం సమీక్ష చేస్తుంటే.. సీఎం జగన్ ఎందుకు సమీక్ష చేయడం లేదని ప్రశ్నించారు.
జగన్ ఉన్మాదంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న టీడీపీ నాయకులపై కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా పోరాటంలో వెనక్కి వెళ్లేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.
రాష్ట్రాన్ని కాపాడేందుకే తన పోరాటమని చెప్పారు. ఇప్పటివరకు నా మంచితనాన్ని చూశారన్న చంద్రబాబు.. తనది ఉక్కు సంకల్పమని తెలిపారు. ఎన్నికల ముందు ముద్దులు పెట్టి అందరినీ నమ్మించిన జగన్రెడ్డి.. అధికారంలోకి రాగానే వంచించారని విమర్శించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com