పంచాయతీ ఎన్నికలు.. వైసీపీ అరాచకాలకు బుద్ధి చెప్పే ఎలక్షన్స్ : చంద్రబాబు
పంచాయతీ ఎన్నికలు.. గేమ్ ఛేంజర్ ఎలక్షన్స్, వైసీపీ అరాచకాలకు బుద్ధి చెప్పే ఎలక్షన్స్ అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై వైసీపీ దమనకాండకు అడ్డుకట్ట వేసే ఎన్నికలుగా అభివర్ణించారు. పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. వారికి పలు సూచనలు చేశారు. బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకొని.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఎక్కడ బెదిరింపులకు పాల్పడినా రికార్డింగ్ చేసి.. ఎన్నికల అధికారులతో పాటు పార్టీ కార్యాలయానికి పంపాలని సూచించారు.
తొలిరోజు నామినేషన్లు వేసిన టీడీపీ నేతలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. నేతలు పోటీ చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలనే పట్టుదలతో ఉన్నారని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉందని తెలిపారు. రానున్న రోజుల్లో 80 వేల కోట్ల రూపాయలతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశముందని చెప్పారు. ప్రతీ గ్రామంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. గ్రామాభివృద్ధి ప్రతి ఒక్కరి విద్యుక్త ధర్మం అన్న చంద్రబాబు.. మీ గ్రామాన్ని మీరే బాగు చేసుకోవాలని సూచించారు.
అటు.. పంచాయతీ ఎన్నికల సమన్వయానికి టీడీపీ కమిటీలు ఏర్పాటు చేసింది. 15 మందితో టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్అఫీషియో, సమన్వయ, కంట్రోల్ రూమ్ కమిటీలు నియమించారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్ని 5 జోన్లుగా విభజించి కమిటీలు ఏర్పాటు చేశారు. టీడీపీ శ్రేణులు, ప్రజలకు సలహాలు ఇచ్చేందుకు లీగల్ సెల్ నియమించారు. 24 గంటలు అందుబాటులో ఉండేలా కమిటీలు ఏర్పాటు చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com