బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం : ఏపీ కి భారీ వర్ష సూచన..!
AP Rains : తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటలలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది వాయవ్య దిశగా ప్రయాణిస్తూ.. సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్ కె.కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో భారీవర్షాలు కురవొచ్చని సూచించారు. రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు, చాలా చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని.. తీరం వెంబడి గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు.
ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ నెల 13 వరకూ అక్కడక్కడ ఉరుములు మెరుపులతో భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 24 గంటలల్లో శ్రీకాకుళం జిల్లా పలాసలో అత్యధికంగా 79.75 మి.మీ వర్షపాతం నమోదైంది. ఒడిశాతో పాటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలోని మత్స్యకారులు బుధవారం వరకు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com