జగన్‌ అను నేను.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా..

జగన్‌ అను నేను.. అంటూ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమవుతున్నారు వైసీపీ అధినేత. పదేళ్ల నుంచి ఎప్పుడా ఎప్పుడా అని.. ఇటు జగన్‌.. అటు వైసీపీ కార్యకర్తలు, జగన్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. సీఎంగా బాధ్యతలు చేపట్టడమే ఆలస్యం..

మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, ప్రజలు భారీగా వస్తారని అంచనా వేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా 5 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌ల కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధుల కోసం మరో మార్గాన్ని నిర్దేశించారు. సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసేందుకు వాహనాలను దారి మళ్లిస్తున్నారు.

స్టేడియంలో మొత్తం రెండు ప్రధాన స్టేజిలను ఏర్పాటు చేశారు. ఓ స్టేజిపై ప్రమాణ స్వీకార కార్యక్రమం, మరోదానిపై గవర్నర్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా ముఖ్య అతిథులు, జగన్‌ కుటుంబ సభ్యులు కూర్చుంటారు . జడ్జిలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. జగన్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రిగా గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తరువాత జగన్‌ ముఖ్యమంత్రి హోదాలో ప్రజల నుద్దేశించి తొలి ప్రసంగం చేస్తారు. ప్రజలకు ధన్యవాదాలు తెలపడంతోపాటు తాను అందించాలనుకుంటున్న సుపరిపాలన ఎలా ఉంటుందనే విషయాన్ని వివరించే అవకాశం ఉంది. కొన్ని కీలక ప్రకటనలు కూడా చేయనున్నారు. మరోవైపు ప్రమాణ స్వీకారం కోసం గవర్నర్ నరసింహన్ ఒక రోజు ముందుగానే విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ ఆర్పీ ఠాకుర్‌తో పాటు అధికారులు ఘనస్వాగతం పలికారు. గవర్నర్ గేట్‌ వే హోటల్‌లో బస చేశారు. ఈ సందర్భంగా నరసింహన్‌ను జగన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లు, తాజా పరిణామాలను ఆయనకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి.సుబ్రమణ్యం, డిజిపి ఆర్పీ ఠాకూర్‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు, జగన్ ప్రమాణస్వీకార ఘట్టానికి సంబంధించిన ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకాలేని వాళ్లు కూడా వీక్షించేందుకు వీలుగా సిటీలో 14 చోట్ల భారీ LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారికి 5 రకాల పాస్‌లు ఇప్పటికే జారీ చేశారు. ప్రజాప్రతినిధుల వాహనాల పార్కింగ్ కోసం ఏఆర్ మైదానాన్ని కేటాయించారు. అధికారులు, సిబ్బంది, సహాయకుల వాహనాల పార్కింగ్ కోసం బిషప్ అజరయ్య ఉన్నత పాఠశాల, స్టేట్ గెస్ట్‌హౌస్‌లను ఉపయోగిస్తారు.

ఎండల తీవ్రత దృష్ట్యా వేదిక ప్రాంగణంలో తాగునీటి సరఫరాపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, లక్ష లస్సీ ప్యాకెట్లు, 3 లక్షల మంచినీటి పాకెట్లను సిద్ధం చేశారు. కార్యక్రమాన్ని వీక్షించే వారి కోసం పైభాగంలో 20 గ్యాలరీలు, కింది భాగంలో వేదిక దగ్గర 15 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రతి గ్యాలరీకి ఒక తహశీల్దారును ఇన్‌చార్జిగా నియమించారు.

విజయవాడలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు.. విశాఖపట్టణం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు కృష్ణాజిల్లా హనుమాన్ ‌జంక్షన్‌, నూజివీడు, విస్సన్నపేట, ఖమ్మం జిల్లా వైరా, ఖమ్మం, సూర్యాపేట మీదుగా హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లే వాహనాలు హైదరాబాద్‌, ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా విశాఖపట్టణం చేరుకోవాలి. అలాగే.. హైదరాబాద్‌, కంచికచర్ల, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా కూడా విశాఖపట్టణం చేరుకోవచ్చు. విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలు గుంటూరు, తెనాలి, బాపట్ల, అవనిగడ్డ, చల్లపల్లి, పామర్రు, గుడివాడ, హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story