రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారు : చంద్రబాబు

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారు : చంద్రబాబు
రాజకీయ ఉగ్రవాదంతో వైసీపీ సర్కారు అన్ని వర్గాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు.

రాజకీయ ఉగ్రవాదంతో వైసీపీ సర్కారు అన్ని వర్గాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందంటూ మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా అభివృద్ధి చేస్తే వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును అంధకారం చేసిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచి అధఃపాతాళానికి తెచ్చారని మండిపడ్డారు.

టీడీపీ తెచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలన్నింటినీ తరిమేసి అభివృద్ధి నిలిపివేశారన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యువజన సంక్షేమ పథకాలను రద్దు చేసి, స్వయం ఉపాధి అవకాశాలకు గండికొట్టారన్న చంద్రబాబు.. యువతకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని ఆరోపించారు.

జగన్‌ ప్రభుత్వం.. వేలాది మంది యువతపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపిందని, సోషల్‌ మీడియాలో విమర్శించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. 67 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఇన్ని ఆలయాలపై దాడులు, విధ్వంసాలు లేవని, ఇంతటి కక్షసాధింపు పాలన, హింసాత్మక చర్యలు గతంలో చూడలేదన్నారు. బీసీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై ఇంతటి దమనకాండ ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు.

చట్టసభలు, పాలనాయంత్రాంగం, న్యాయవ్యవస్థ, రాజ్యాంగ సంస్థలు, మీడియాపై దాడి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా సమాజాన్ని చైతన్య పరిచే బాధ్యత భుజాన వేసుకోవాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి, భావితరాల ప్రగతికి దోహదపడాలని చంద్రబాబు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story