Pattabhi TDP leader: పట్టాభి రామ్కు బెయిల్ మంజూరు..
Pattabhi ram (tv5news.in)
Pattabhi TDP leader: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభికి బెయిల్ మంజూరైంది.. ఏపీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.. బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి.. పట్టాభి ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యలను సీడీ రూపంలో హైకోర్టుకు అందజేశారు ప్రభుత్వ తరపు న్యాయవాదులు.. దీనికి సంబంధించిన సీడీని కోర్టులోనే ప్లే చేసి న్యాయమూర్తికి వినిపించారు. అయితే, పట్టాభి తరపు న్యాయవాదులు కూడా గట్టిగానే వాదనలు వినిపించారు..
పట్టాభిని అన్యాయంగా అరెస్టు చేశారని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు.. పట్టాభిపై నమోదు చేసిన సెక్షన్లు వర్తించవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. 41 కింద నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టు చేస్తారని పోలీసులను ప్రశ్నించారు.. అటు ప్రభుత్వం తరపు న్యాయవాది విజ్ఞప్తిని హైకోర్టు నిరాకరించింది.
పోలీసుల తీరుపైనా హైకోర్టు ధర్మాసనం మండిపడింది.. 41 సీఆర్పీసీ సమాధానం రాకుండానే ఎందుకు అరెస్టు చేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కింది కోర్టు ఎలా రిమాండ్ ఇచ్చారో చెప్పాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. జడ్జిలను తిడుతున్నారని.. సీఎంను తిట్టారని కోర్టు వ్యాఖ్యానించింది..
రూల్ ఆఫ్ లాకు ముఖ్యమంత్రి ఎక్కువ కాదని స్పష్టం చేసింది.. ప్రొసీజర్ లేకుండా ఎలా పడితే అలా చేస్తారంటూ పోలీసుల తీరుపై కోర్టు సీరియస్ అయింది.. 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేసే ప్రక్రియను పోలీసులు అమలు చేయలేదని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు పట్టాభికి బెయిల్ మంజూరు చేసింది.
ముఖ్యమంత్రి జగన్పై పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారంటూ పట్టాభిపై గవర్నర్పేట పీఎస్లో కేసు నమోదు కాగా.. బుధవారం రాత్రి పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు.. కోర్టులో హాజరుపరచగా.. రిమాండ్ కోసం మచిలీపట్నం జైలుకు తరలించారు.. అక్కడ్నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభిని తరలించారు పోలీసులు. హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదల కానున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com