Duggirala MPP Election : దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక .. క్షణక్షణం ఉత్కంఠ
Duggirala MPP Election : గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక రసకందాయంగా మారింది. క్షణక్షణం ఉత్కంఠ రేపుతుంది. మరికాసేపట్లో మొదలుకానున్న ఎంపీపీ ఎన్నికలో.. ముందుగా కో-ఆప్షన్ ఎన్నిక ఉంటుంది. ఆ తరువాత ఎంపీపీ ఎన్నిక, ఆ తరువాత ఇద్దరు వైస్ ఎంపీపీలకు ఎన్నిక ఉంటుంది. సంఖ్యాబలం లేకున్నా మండలాధ్యక్ష పీఠం కైవసం చేసుకోవాలని వైసీపీ ప్లాన్ చేసిందని టీడీపీ ఆరోపిస్తుంది. ఐదుగురు సభ్యులతో మాత్రమే వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే సమావేశానికి వచ్చారు. మరో ముగ్గుర్ని వేరే ప్రాంతంలో ఉంచినట్లు తెలుస్తోంది. అయితే.. నిన్న కిడ్నాప్ చేశారన్న వైసీపీ ఎంపీటీసీ పద్మ.. ఇవాళ్టి మీటింగ్కి గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే ఆర్కేనే పద్మను మీటింగ్కి రాకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పద్మ రెబల్గా పోటీ చేస్తే తమ పథకం పారదనే ఉద్దేశంతోనే వైసీపీ కుట్రలు చేస్తుందని టీడీపీ ఆరోపిస్తుంది. అటు.. టీడీపీ ఎంపీటీసీలతో కలిసి సమావేశానికి వెళ్లారు జనసేన సభ్యుడు. పోలీస్ ఎస్కార్ట్ మధ్య టీడీపీ సభ్యులు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు.దుగ్గిరాల 18 ఎంపీటీసీల్లో.. టీడీపీ-9, జనసేన-1, వైసీపీ-8 స్థానాలు గెలుచుకున్నాయి. దుగ్గిరాల ఎంపీపీ స్థానం బీసీకి రిజర్వ్ అయింది. టీడీపీ బీసీ నేతకు అధ్యక్ష పదవి దక్కకుండా చేసేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి షేక్ జబీన్కు బీసీ సర్టిఫికేట్ ఇవ్వకుండా నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు.. వైసీపీ నుంచి సంతోష రూపవాణిని ఎంపీపీగా నిలబెడుతున్నారు. నాటకీయ పరిణామాల మధ్య సమావేశానికి వచ్చారు వైసీపీ ఎంపీటీసీలు.
ఇక.. ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో దుగ్గిరాలలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. పట్టణంలో పది చోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఎంపీడీవో కార్యాలయం వైపు ఎవరూ రాకుండా తనిఖీలు చేపట్టారు. ఇద్దరు డీఎస్పీలు, 20 మంది సీఐల ఆధ్వర్యంలో భద్రత పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com