ఏపీ సరిహద్దు గరికపాడు చెక్‌పోస్టు వద్ద ఆంక్షలు..!

ఏపీ సరిహద్దు గరికపాడు చెక్‌పోస్టు వద్ద ఆంక్షలు..!
ఏపీలో 18 గంటల కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. ఉదయం 6 నుంచి మధ్నాహ్నం 12 గంటల వరకే అనుమతిచ్చింది. ఈ మేరకు కర్ఫ్యూ ఉత్తర్వులు జారీ చేసింది

ఏపీలో 18 గంటల కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. ఉదయం 6 నుంచి మధ్నాహ్నం 12 గంటల వరకే అనుమతిచ్చింది. ఈ మేరకు కర్ఫ్యూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. దీంతో రాష్ట్ర సరిహద్దు గరికపాడు చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. మధ్నాహ్నం 12 గంటల తర్వాత సరిహద్దును మూసివేశారు.

ఏపీలో ఈనెల 18 వరకు పాక్షిక కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం తెలిపింది. అయితే.. కర్ఫ్యూ నుంచి అత్యవసరమైన పలు విభాగాలకు మినహాయింపునిచ్చింది ప్రభుత్వం. కర్ఫ్యూ నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, టెలికామ్, ఇంటర్నెట్, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ సేవలకు మినహాయింపునిచ్చింది.

అలాగే.. పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ, గ్యాస్ అవుట్‌లెట్లు, విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా సంస్ధలు, నీటి సరఫరా, పారిశుద్ధ్య, గిడ్డంగులు, సెక్యూరిటీ సేవలు, పరిశ్రమలు, వ్యవసాయ, అనుబంధ రంగాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది.

రాష్ట్రంలో రాకపోకలు, వేడుకలపై ఏపీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. విమాన, రైల్వే ప్రయాణికులు టికెట్లు చూపించాలని ప్రభుత్వం ఆదేశించింది. రాకపోకల వేళల్లో విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని తెలిపింది. వివాహాలు, శుభకార్యాలు, వేడుకలపై కరోనా ఆంక్షలు విధించిన ప్రభుత్వం.. ఇప్పటికే నిర్ణయించిన పెళ్లిళ్లు జరుపుకునేందుకు అనుమతి తప్పనిసరి అని స్పష్టంచేసింది.

వివాహాలు, ఇతర శుభకార్యాలకు 20 మందికి మించవద్దని ఆదేశించింది. రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూ ఉన్న నేపథ్యంలో రోజంతా 144 సెక్షన్ అమలు చేయాలని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story