ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలన్నింటికీ ఇదే షెడ్యూల్!
కొవిడ్ లాక్డౌన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో 7 నెలలుగా మూతపడిన స్కూళ్లు, కాలేజీలు... నవంబర్ 2న తిరిగి తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్కూళ్లు, కాలేజీల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్ వెల్లడించారు. కోవిడ్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.
నవంబర్ 2 నుంచి తొమ్మిది, పది, ఇంటర్ విద్యార్థులకు తరగతులు రోజు విడిచి రోజు... ఒక్క పూట నిర్వహించనున్నట్టు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. రొటేషన్ పద్ధతిలో తరగతులను నిర్వహిస్తారు. నవంబర్ 23 నుంచి ఆరు, ఏడు, ఎనిమిదో తరగతులకు బోధన ప్రారంభం అవుతుంది. ఇక... డిసెంబర్ 14 నుంచి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతులకు క్లాసులు నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు అన్నింటికీ కూడా ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టంచేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com