శ్రీను ఇకలేడు.. దేనినైతే ఇష్టంగా ప్రేమించాడో అదే అతని ప్రాణం తీసింది
పాములంటే ఇష్టం.. వాటిని చంపొద్దని ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేశాడు. పాములపై ప్రజల్లో భయం పోగొట్టేందుకు వాటిని పట్టుకుని ఆడించేవాడు. ఎవరి ఇంట్లోనైనా పాము కనిపిస్తే చాలు వాళ్ళకు టక్కున గుర్తించేది అతని పేరే. పాములను పట్టడం అతడి వృత్తి కాదు.. ఇష్టం.. అతనికి అది ప్రవృత్తి. అయితే దేనినైతే ఇష్టంగా ప్రేమించాడో చివరకు అదే అతని ప్రాణం తీసింది. అతనే పటాన్చెరు ప్రజలు ముద్దుగా పిలుచుకునే పాముల శ్రీనన్న.
పటాన్ చెరు పట్టణంలో, పరిసర గ్రామలలో ఎక్కడైనా పాము కనిపిస్తే ముందుగా అందరికి గుర్తొచ్చేదే పాములు పట్టే వ్యక్తి శ్రీనివాస్ ముదిరాజ్. ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో పనిచేస్తున్న శ్రీనివాస్ డ్యూటీ లేని సమయంలో ఎవరైనా పాములు తిరుగుతున్నాయని చెపితే చాలు వాటిని పట్టి అటవీ ప్రాంతంలో వదిలే వాడు. అలాగే ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ అనే స్వచ్చంద సంస్థలో వాలంటీర్గా పనిచేస్తున్నాడు. పాములు పట్టొద్దని ఇంట్లో వారు చెప్పినా వినకుండా అదే పని చేసేవాడు గురువారం వికారాబాద్ జిల్లాకు పనిపై వెళ్లగా అక్కడ మర్పల్లి మండలం కొంశెట్టిపల్లి గ్రామంలో ఓ ఇంట్లో నాగుపాము ఉందని శ్రీనివాస్కు ఫోన్ వచ్చింది. అక్కడే ఉన్న శ్రీను దాన్ని పట్టడానికి వెళ్లాడు. పామును పట్టే క్రమంలో అది రెండు సార్లు అతనిని కాటు వేసింది. అయిన అది ఏమి పట్టించుకోకుండా దాన్ని పట్టుకున్నాడు. తర్వాత అతనిని సదాశివపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడ శ్రీను పరిస్ధితి విషమించడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చివరకు అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతని మృతితో పటాన్చెరు పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com