దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు
వైరస్ ముంచుకొచ్చేస్తోంది. కుర్రాళ్లు, పెద్దాళ్లు, పిల్లలు తేడా లేనే లేదు. సెకండ్ వేవ్ చాలా తీవ్రత చూపిస్తోంది. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 2 లక్షల 60 వేలకుపైగా పాజిటివ్గా తేలారు. ఈ లెక్కలన్నీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయ్. సరాసరిన గంటకు 10 వేల కేసులు వస్తుంటే.. మరణాలు కూడా ఊహించని రీతిలో పెరుగుతున్నాయ్.
నిన్న 1493 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వారమంతా కూడా 2 లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు బయటపడ్డాయి. తీవ్రత ఈ స్థాయిలో ఉంది అని తెలిసాక కూడా.. జనం జాగ్రత్తలు పాటించకపోవడంతో ముప్పు మరింత పెరుగుతోంది.మార్చి నెలాఖరున కరోనా కేసుల సంఖ్య చూస్తే 50 వేలకు అటుఇటుగా ఉండేది. ఇప్పుడది ఏకంగా 2 లక్షల 60 వేలకు పెరిగింది.
అంటే 3 వారాల వ్యవధిలో అంతా తారుమారు అయిపోయింది. ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే కోవిడ్ వేల మంది జీవితాల్ని ఖతం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఏప్రిల్ 4 నుంచి 10వ తేదీ వరకూ చూస్తే అప్పుడు సరాసరిన లక్ష కేసులు ఉండేవి. ఏప్రిల్ 10 తర్వాత ఒక్కసారిగా ఇది 2 లక్షలు దాటేసింది. ఇప్పుడు 3 లక్షలకు చేరువయ్యేలా పరిగెడుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com