కూలీ పని కోసం రైలెక్కి .. 20 ఏళ్ల తర్వాత సైనికుల సహయంతో తిరిగొచ్చాడు.. !
కూలీ పని కోసం రైలెక్కిన ఓ వ్యక్తి... 20 ఏళ్ల తరవాత సైనికుల సహయంతో తన సొంత గ్రామానికి చేరుకున్నాడు. ఈ 20 సంవత్సరాలలో రాష్ట్రం కాని రాష్ట్రంలో అష్టకష్టాలు పడ్డాడు... ఇక వివరాల్లోకి వెళ్తే... కర్ణాటక ధార్వాడ్ జిల్లా గాంధీనగర్కు చెందిన కెంచప్ప గోవిందప్ప అనే వ్యక్తి... 20 సంవత్సరాల క్రితం కూలీ పనికోసం అని రైలెక్కాడు.
అయితే అతను టికెట్ లేకుండా రైలెక్కడంతో అధికారులు అతనిని హరిద్వార్లో దింపేశారు.. అక్కడ కొద్దిసేపు ఉండి మరో రైలు ఎక్కాడు కెంచప్ప... అక్కడికి వెళ్ళాక.. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో తెలియక అలా వివిధ రైళ్లు మారుతూ వచ్చాడు. చివరికి జమ్ముకశ్మీర్కు చేరుకొని.. అక్కడో హోటల్ లో పనిలో చేరాడు.
అయితే కెంచప్ప అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న ఆ పని యజమాని సరిగ్గా తిండి పెట్టకుండా, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా నానా కష్టాలు పెట్టాడు. జీతం కూడా సరిగ్గా ఇచ్చేవాడు కూడా కాదు.. చివరికి తన ఊరికి వెళ్లేందుకు సహాయం చేయకుండా, ఎక్కడికైనా పారిపోతాడేమో అనే భయంతో కెంచప్పను రాత్రిసమయాల్లో ఓ గదిలో తాడుతో బంధించి ఉంచేవాడు.
కెంచప్ప చదువుకోకపోవడంతో అక్కడే ఉంటూ అష్టకష్టాలు పడ్డాడు. అలా అక్కడే 20 సంవత్సరాలు గడిపాడు. అయితే ఒకరోజు... ఆ హోటల్కి కర్ణాటక గదగ జిల్లాకు చెందిన కొంతమంది సైనికులు రావడం, వారంతా కన్నడలో మాట్లాడుకుంటూ ఉండడంతో వారి దగ్గరకి వెళ్లి తన బాధను చెప్పుకున్నాడు.
దీనితో వారి సహాయంతో సొంత ఊరికి చేరుకున్నాడు. కాగా కెంచప్పకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అతని రాక పట్ల వారంతా సంతోషంగా ఉన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com