చైనాతో కీలక ఒప్పందం చేసుకున్నాం : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

చైనాతో కీలక ఒప్పందం చేసుకున్నాం : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
లద్ధాఖ్‌ సరిహద్దుల్లో 9 నెలలుగా సాగుతున్న ఉద్రిక్తతలకు బలగాల ఉపసంహరణతో తెరపడనుందన్నారు రాజ్‌నాథ్ సింగ్.

చైనాకు అంగుళం భూమి కూడా వదులుకునేది లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తూర్పు లద్ధాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆయన రాజ్యసభలో ప్రకటన చేశారు. లద్ధాఖ్‌ సరిహద్దుల్లో 9 నెలలుగా సాగుతున్న ఉద్రిక్తతలకు బలగాల ఉపసంహరణతో తెరపడనుందన్నారు. ఇందుకోసం చైనాతో కీలక ఒప్పందం చేసుకున్నామని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఇక ఈ ఒప్పందం వల్ల భారత్ ఏమీ నష్టపోలేదని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మన సైన్యంపై ప్రశంసల జల్లు కురిపించారు. సరిహద్దుల్లో భారత జవాన్లు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని కొనియాడారు.

మరోవైపు తూర్పు లద్దాఖ్‌లో గతేడాది భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 45మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా వార్తాసంస్థ పేర్కొంది. జూన్ 2020‌లో జరిగిన ఆ ఘటనలో 20మంది భారత సైనికులు అమరులైనట్లు భారత్‌ అప్పట్లోనే ప్రకటించింది. కానీ, ఆ ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు మరణించారన్న విషయాన్ని అక్కడి పీఎల్‌ఏ ప్రభుత్వం వెల్లడించలేదు. తాజాగా ఆ విషయాన్ని రష్యా అధికార మీడియా ఏజెన్సీ టాస్‌ తెలిపింది.

భారత్‌-చైనా దేశాల సరిహద్దుల మధ్య తొమ్మిది నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించుతూ ఇరు దేశాల బలగాలఉపసంహరణ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఈ నేపథ్యంలో రష్యా మీడియా సంస్థ విడుదల చేసిన నివేదికలో, గల్వాన్‌ ఘటనలో 45మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. 20మంది భారత సైనికులు అమరులైనట్లు పేర్కొంది. వీటిపై అమెరికాతో పాటు అప్పట్లో వచ్చిన కొన్ని ఇంటిలిజెన్స్‌ నివేదికలను ఉటంకించింది.

సరిహద్దుల్లో ఏర్పడ్డ ప్రతిష్టంభన కారణంగా ఇరుదేశాలు దాదాపు 50వేల మంది సైనికులను మోహరించాయని రష్యా మీడియా సంస్థ టాస్‌ వెల్లడించింది. అయితే, ఈమధ్యే రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భారత్‌, చైనా విదేశాంగమంత్రుల సమావేశంతో పాటు ఇప్పటికే తొమ్మిది దఫాల్లో కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చల ఫలితంగా ఇరుదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా బలగాల ఉపసంహరణ ప్రక్రియను ఇరుదేశాలు మొదలుపెట్టాయి.

Tags

Read MoreRead Less
Next Story