దేశంలో మరోసారి డేంజర్‌బెల్స్ మోగిస్తోన్న కరోనా వైరస్

దేశంలో మరోసారి డేంజర్‌బెల్స్ మోగిస్తోన్న కరోనా వైరస్
బుధవారం 7,78,416 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..22,854 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 126 మంది మృతి.

దేశంలో కరోనా వైరస్ మరోసారి డేంజర్‌బెల్స్ మోగిస్తోంది. కరోనా కేసుల్లో కొద్ది రోజులుగా పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, గడిచిన 24 గంటల్లో వాటి సంఖ్య భారీగా పెరిగింది. రోజువారీ కేసుల సంఖ్య రెండు నెలల గరిష్ఠానికి చేరింది. బుధవారం 7,78,416 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..22,854 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. 126 మంది మృత్యు ఒడికి చేరుకున్నారు. దాంతో మొత్తం కేసులు సంఖ్య 1,12,85,561కి చేరగా.. ఇప్పటివరకు ఈ మహమ్మారితో ఒక లక్షా 58వేల189 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులు ఎక్కువవుతుండటంతో యాక్టివ్ కేసుల్లో కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం 1,89,226 యాక్టివ్ కేసులుండగా..ఆ రేటు 1.68 శాతానికి చేరింది. అయితే వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కాస్త మెరుగ్గానే ఉంది. తాజాగా 18,100 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. రికవరీ రేటు 96.92 శాతానికి చేరింది.

మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కలవరం పుట్టిస్తోంది. రోజూ సుమారు 10వేల కేసులు నమోదవుతున్నాయి. కానీ, నిన్న మాత్రం అత్యధికంగా 13,659 కొత్త కేసులు వెలుగుచూశాయి. 54 మరణాలు సంభవించాయి. లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఆ రాష్ట్రంలోనే ఉన్నాయి. దేశంలోని కొత్త కేసులు, మరణాల విషయంలో మహారాష్ట్ర వాటానే ఎక్కువగా ఉండటం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజలు స్వీయ క్రమశిక్షణ పాటించాలని మంత్రులు, అధికారులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే రాష్ట్రం మరోసారి లాక్‌డౌన్‌లోకి వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఇటు తెలంగాణలోనూ కరోనా మరోసారి విజృంభిస్తోంది. కొత్తగా రాష్ట్రంలో 194 కేసులు నమోదు కాగా ముగ్గురు చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 1,855 ఉండగా ,డిశ్చార్జ్ రెండు లక్షల 97గా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 3లక్షల 536 కరోనా కేసులు నమోదయ్యాయి.


Tags

Read MoreRead Less
Next Story