corona update: భయపెడుతున్న కరోనా.. మరో మూడు నెలలు జాగ్రత్తగా..

corona update: భయపెడుతున్న కరోనా.. మరో మూడు నెలలు జాగ్రత్తగా..
మిజోరం, ఆంధ్రప్రదేశ్‌‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో 10వేలు కన్నా ఎక్కువగా క్రియాశీల కేసులు

corona update: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి స్థిరంగా ఉందని కేంద్రం వెల్లడించింది. రాబోయే మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు హెచ్చరించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని, కేరళలో కూడా కేసులు తగ్గుదల కనబడుతోందని కేంద్రం తెలిపింది. అయితే... రాబోయే రెండు, మూడు నెలలు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని, కరోనా వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. రాబోయే మూడు నెలలూ పండుగల సమయం, అలాగే... ఫ్లూ కేసులు పెరిగే కాలం గనుక ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ కోరారు.

ఇప్పటివరకు కరోనా కట్టడిలో సాధించిన ఫలితాలను మరింత మెరుగుపరుచుకునే విధంగా ప్రజలు సహకరించాలన్నారు వీకే పాల్‌. దేశవ్యాప్తంగా యువ జనాభాలో ఇప్పటివరకు 20శాతం మందికి రెండు డోసులు పంపిణీ పూర్తయిందని, అలాగే.... 62శాతం మందికి కనీసం ఒక్కడోసు అందినట్టు చెప్పారు. 32 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా ఎక్కువగా ఉండగా... 32 జిల్లాల్లో మాత్రం 5 నుంచి 10శాతంగా ఉందని తెలిపారు. ఆయా జిల్లాల్లో మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు. గత వారంలో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 67 శాతం కేసులు కేరళలోనే వచ్చాయని, ప్రస్తుతం అక్కడ లక్షా 99 వేల క్రియాశీల కేసులు ఉన్నాయని వివరించారు.

మిజోరం, ఆంధ్రప్రదేశ్‌‌, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో 10వేలు కన్నా ఎక్కువగా క్రియాశీల కేసులు ఉన్నట్టు కేంద్రం తెలిపింది. మిజోరంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ వ్యాక్సినేషన్‌ వేగంగా జరిగి, తగిన చర్యలు తీసుకోవడం ద్వారా మెరుగుపడుతుందని తెలిపింది. ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని... పండుగల సీజన్‌ వస్తుండటంతో వ్యాక్సిన్‌ తీసుకోవడం, కరోనా నిబంధనలు పాటించడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్‌ డీజీ డాక్టర్‌ బలరాం భార్గవ అన్నారు. కేరళలో ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయని, ఇతర రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని చెప్పారు. పండుగల సీజన్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కరోనా కేసులు అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story