అక్టోబర్ నాటికి గరిష్ఠస్థాయికి కరోనా థర్డ్వేవ్..!
Coronavirus: మొదటి, రెండో దశ కరోనా కల్లోలం మిగిల్చిన విషాదం నుంచి కోలుకోక ముందే... దేశంలో మళ్లీమూడో దశ ఆందోళన మొదలైంది. అక్టోబర్లో కరోనా థర్డ్ వేవ్ ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం ఈ మేరకు అంచనా వేసింది. ఈ సారి చిన్నారులు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. పరిస్థితి తీవ్రతకు అనుగుణంగా వైద్య సదుపాయాలు లేవంటూ... నిపుణుల బృందం అసంతృప్తి వ్యక్తం చేసింది.
కరోనా థర్డ్వేవ్ అక్టోబర్ నాటికి గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చని.. పెద్దల లాగానే పిల్లలు కూడా ప్రభావితం కావొచ్చని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ సూచనలు చేసింది. నిపుణుల బృందం నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించినట్టు తెలుస్తోంది. 'థర్డ్వేవ్ ప్రిపేర్డ్నెస్-చిల్డ్రన్ వల్నరబిలిటీ అండ్ రికవరీ' శీర్షికన వెలువడిన ఈ నివేదిక అందుబాటులో ఉన్న సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకవేళ చిన్నారులు భారీగా కరోనా బారిన పడి, ఆసుపత్రిలో చేరే పరిస్థితి తలెత్తితే.. వైద్యసిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్సులు వంటి వైద్యసేవలు అవసరానికి తగ్గట్టుగా అందుబాటులో లేవని బృందం తెలిపింది. చికిత్స సమయంలో వైరస్ సోకిన పిల్లలతో ఉండే సంరక్షకులు... సురక్షితంగా ఉండేలా కొవిడ్ వార్డుల నిర్మాణం ఉండాలని సూచించింది. అలాగే ప్రత్యేక అవసరాలున్న పిల్లలు, ఇతర వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు టీకా వేయాల్సిన ఆవశ్యకతను గుర్తుచేసింది.
మరోవైపు... థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్రం ప్రకటనలు చేస్తోంది. కేంద్రం థర్డ్వేవ్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని, చిన్నపిల్లల వైద్యసేవల వ్యవస్థ బలోపేతానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఇటీవల కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ చెప్పారు. మరోవైపు... చిన్నారులకు టీకా అందించే దిశగా అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు. తాజాగా అత్యవసర ఆమోదం పొందిన జైడస్ క్యాడిలా.. దేశంలో 12 ఏళ్లు దాటిన వారికి అందుబాటులోకి వచ్చింది. సెప్టెంబర్ మధ్య నుంచి టీకా సరఫరా ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో భారత్లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టించింది. వైద్య సేవల కొరత, మార్చురీలు, స్మశానాలు నిండిపోవడం, అంత్యక్రియల కోసం గంటల తరబడి వేచి చూడటం ప్రతి ఒక్కరిని కలచివేసింది. వైరస్ తగ్గుముఖం పడుతున్న సమయంలో థర్డ్వేవ్ ఆందోళన మొదలైంది. నిపుణుల సూచనలకు తగ్గట్టుగా వైద్య సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రతి 100 వైరస్ పాజిటివ్ కేసుల్లో 23 మందికి హాస్పిటల్లో వైద్య సేవలు అందేలా సన్నాహాలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్ సూచించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com