ఎట్టకేలకు భారత్‌లో అందుబాటులోకి రానున్న కరోనా వ్యాక్సిన్‌

ఎట్టకేలకు భారత్‌లో అందుబాటులోకి రానున్న కరోనా వ్యాక్సిన్‌
ఏదైనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన దాన్ని సరైన వాతావరణంలో నిల్వ చేయడమే అత్యంత ముఖ్యమైన అంశం.

కరోనా వ్యాక్సిన్‌ ఎట్టకేలకు భారత్‌లోకి అందుబాటులోకి రానుంది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల కమిటీ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ను అత్యవసర వినయోగం కోసం ఆమోదించాలంటూ నిపుణుల కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే వ్యాక్సిన్‌ పంపిణీకి డీసీజీఐ అనుమతులిచ్చే అవకాశముంది. ఇక మరో సంస్థ భారత్‌ బయోటెక్‌ దరఖాస్తుపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ సహకారంతో ఆస్ట్రాజెనెకా ఏజెడ్‌డీ1222 లేదా కొవిషీల్డ్‌ అనే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. అయితే, మూడో దశ ప్రయోగాలను రెండు విధాలుగా జరిపింది. ఒక విధానంలో రెండు డోసులను ఇచ్చి పరీక్షించిన ఆస్ట్రాజెనెకా, మరో విధానంలో ఒక పూర్తి డోసు, మరో అరడోసుతో ప్రయోగం జరిపింది. ఇందులో ఒకదానిలో 62 శాతం, మరో విధానంలో 90 శాతం సమర్థత సాధించినట్లు వెల్లడించింది. తాము అభివృద్ధిచేసిన వ్యాక్సిన్‌ సరాసరి 70 శాతం సమర్థత కలిగి ఉన్నట్లు మధ్యంతర విశ్లేషణ ఫలితాల్లో ఆక్స్‌ఫర్డ్ వెల్లడించింది. ఇక ఆసుపత్రుల్లో చేరే తీవ్రత ఉన్న కేసుల్లో వందశాతం రక్షణ కల్పిస్తుందంటున్నారు ఆస్ట్రాజెనెకా సీఈఓ పాస్కల్‌ సోరియట్‌

ఏదైనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన దాన్ని సరైన వాతావరణంలో నిల్వ చేయడమే అత్యంత ముఖ్యమైన అంశం. ఫైజర్‌ టీకాను నిల్వ చేయడానికి మైనస్‌ 70 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత అవసరం. దీంతో ఆ టీకా నిల్వ, సరఫరా చాలా శ్రమ, ఖర్చుతో కూడుకున్నది. కానీ, ఆస్ట్రాజెనెకా టీకాను కేవలం సాధారణ రిఫ్రిజిరేటర్ల ఉష్ణోగ్రత వద్వే నిల్వ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఉష్ణోగ్రత వద్ద దీన్ని ఆరు నెలలపాటు నిల్వ చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది. దీంతో మారుమూల ప్రాంతాలకు కూడా సులభంగా సరఫరా చేసే ఆస్కారం ఉంటుంది.

టీకా వినియోగానికి అనుమతులు వచ్చిన వెంటనే భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ఆస్ట్రాజెనెకా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకొంది. ఇందుకోసం భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లోనూ వీటిని సరఫరా చేసేందుకు వీలుగా దాదాపు 5 కోట్ల డోసులను ఇప్పటికే సిద్ధం చేసినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది. కాగా.. ఇతర టీకాలతో పోలిస్తే కొవిషీల్డ్‌ తక్కువ ధరకే లభించనుంది. డోసుకు 3 డాలర్లు చొప్పున ప్రభుత్వానికి కొవిషీల్డ్‌ టీకాలు ఇవ్వనున్నట్లు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో తెలిపారు. అంటే ఒక వ్యక్తికి రెండు డోసులకు కలిపి 6 డాలర్లు అంటే దాదాపు 440 రూపాయలు ఖర్చవుతుంది. అదే ప్రయివేటు మార్కెట్లో మాత్రం ఈ టీకా రూ. 700 నుంచి రూ. 800 వరకు ఉండనున్నట్లు చెప్పారు.


Tags

Read MoreRead Less
Next Story