ప్రతిఒక్కరికి రూ.4లక్షలు చొప్పున చెల్లించలేమని కోర్టుకు తెలిపిన కేంద్రం...!
కొవిడ్ మృతుల కుటుంబాలకు విపత్తు సహాయం కింద పరిహారం ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంలో విచారణ జరిగింది. ప్రభుత్వం వినిపించిన వాదనలను పరిశీలించిన సుప్రీం.. బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించే నిమిత్తం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ కనీస ప్రమాణాలు రూపొందించాలని ఆదేశించింది. తద్వారా కొంత మొత్తం చెల్లించవచ్చని చెప్పింది. కనీస ప్రమాణాలను సూచించడంలో ఎన్డీఎంఏ విఫలమైందని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే పరిహార నియమాలు, పరిహారం మొత్తాన్ని నిర్ణయించడం తమ పరిధిలో లేదని... కేంద్రమే నిర్ణయించాలని స్పష్టం చేసింది.
అదేవిధంగా కొవిడ్ మృతుల మరణ ధ్రువీకరణ పత్రాలను కూడా వెంటనే జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. మరణ ధ్రువీకరణ పత్రాల్లో మరణించిన తేదీ, కారణం స్పష్టంగా ఉండాలని పేర్కొంది. కొవిడ్ కారణంగా మరణించిన ప్రతిఒక్కరికి 4లక్షలు చెల్లించలేమని కొద్ది రోజుల క్రితం కేంద్రం కోర్టుకు వెల్లడించింది కేంద్రం.
ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా 3.98లక్షలకు పైగా కరోనా మరణాలు సంభవించాయి. అంతమందికి పరిహారం ఇవ్వాల్సి వస్తే విపత్తు నిర్వహణ నిధులన్నీ వాటికే కేటాయించాల్సి వస్తుందని కేంద్రం కొద్ది రోజుల క్రితం కోర్టుకు వెల్లడించింది. దాంతో కరోనా విజృంభణ సమయంలో అత్యవసర వైద్యసేవలు, పరికరాలను సమకూర్చుకోవడం, తుపానులు, వరదలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాల వద్ద సరిపడా నిధులుండవని వెల్లడించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com