ప్లీజ్ అంకుల్ మా నాన్నను వదిలిపెట్టండి : రాకేశ్వర్ సింగ్ కుమార్తె
కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ తమ చెరలోనే ఉన్నారని మావోయిస్టులు తెలిపారు. ఈ మేరకు ఓ లేఖ విడుదల చేశారు. లేఖలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు పలు డిమాండ్స్ ముందు ఉంచారు. ఆపరేషన్ ప్రహార్-3ని తక్షణమే నిలిపివేయాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే ప్రజా ఉద్యమానికి మద్దతుగా ఈ నెల 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.
మావోయిస్టులో చెరలో ఉన్న తన తండ్రి రాకేశ్వర్ సింగ్ ను విడుదల చేయాలని ఆయన కూతురు కన్నీటిపర్యంతమైంది. ప్లీజ్ అంకుల్ మా నాన్నను వదిలిపెట్టండని కుమార్తె ఏడుస్తున్న వీడియో అందరిని కలచివేస్తోంది.
మరోవైపు ఛత్తీస్గడ్కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్షా.. అమరులైన వీర జవాన్లకు నివాళులర్పించారు. సీఎం భూపేష్ బాఘేల్తో... కలిసి ఎన్కౌంటర్లో గాయపడి చికిత్స పొందుతున్న జవాన్లను పరామర్శించారు. జవాన్ల శౌర్యాన్ని దేశం ఎన్నటికీ మరిచిపోదన్నారు. నక్సల్స్ కు ధీటైన సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
ఈ ఎన్ కౌంటర్ ను సీరియస్ గా తీసుకున్న మోదీ ప్రభుత్వం దెబ్బకు దెబ్బ తీయాలని సిద్ధమైంది. జవాన్లపై దాడి సూత్రదారి హిడ్మాతో పాటు మరో 8 మంది మావోయిస్టు కమాండర్ల ఏరివేతే లక్ష్యంగా వ్యూహం రచిస్తోంది. ఆపరేషన్ ప్రహార్-3 పేరుతో నక్సల్స్ జాడే లేకుండా చేయడానికి పూనుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com