దేశంలో మరోసారి మొదలైన ఎన్నికల హీట్

దేశంలో మరోసారి మొదలైన ఎన్నికల హీట్
నాలుగు కీలక రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరగనున్న ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

దేశంలో మరోసారి ఎన్నికల హీట్ మొదలైంది. నాలుగు కీలక రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరగబోయే ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గత ఐదేళ్లలో ఈ ఐదు చోట్ల ఎన్నికల ముఖచిత్రంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన తృణమూల్‌కు ఈ సారి బీజేపీ సవాల్‌ విసురుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు ఊపుతో అధికారమే లక్ష్యంగా పనిచేస్తోంది. అక్కడ కాంగ్రెస్‌-వామపక్ష కూటమి ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. 2016 ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని TMC రెండోసారి అధికారంలోకి వచ్చింది. సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉన్న వామపక్షాలను మట్టికరిపించి అధికారంలోకి వచ్చిన టీఎంసీ రెండోసారి మరో 27 సీట్లు అదనంగా గెలుచుకుని 211 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్‌- వామపక్ష కూటమి 77 సీట్లు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఆరు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కానీ ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. బీజేపీ బలం పుంజుకుంది..TMCకి గట్టిసవాల్‌ విసురుతోంది.

మరోవైపు జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజ నేతల మరణాలతో తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడింది. కమల్‌ ఇప్పటికే పార్టీని స్థాపించినప్పటికీ ప్రభావం అంతంతే. ఇక రజనీ రాజకీయ ప్రవేశానికి ముందే రిటైర్డ్‌ హర్ట్‌ అయ్యారు. దీంతో పాత యుద్ధమే రీస్టార్ట్‌ కానుంది. స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే కాంగ్రెస్‌తో కలిసి అధికారం దిశగా అడుగులు వేస్తోంది. అన్నాడీఎంకే- భాజపా కూటమికి సవాల్‌ విసురుతోంది. 2016లో ఏఐఏడీఎంకే రెండోసారి అధికారంలోకి వచ్చింది. అన్నాడీఎంకే 136 స్థానాల్లో గెలుపొందగా...డీఎంకే 89 సీట్లు, కాంగ్రెస్‌ పార్టీ 8 స్థానాలకు పరిమితమయ్యాయి.

ఇక కేరళలో పూర్వవైభవానికి కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తోంది. అయితే, క్యాడర్‌ను నమ్ముకున్న బీజేపీ సైతం తనవంతు కృషి చేస్తోంది. ఇటీవల స్థానిక ఎన్నికల్లో గెలుపు ఇచ్చిన ధైర్యంతో ఎల్డీఎఫ్‌ ధీమాతో ఉంది. గత ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలో ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం 91 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్‌ 47 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక్కడ బీజేపీ కేవలం ఒకే ఒక్క స్థానానికే పరిమితమైంది.

పుదుచ్చేరిలో 30 స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, డీఎంకే కలిసి 17 స్థానాలు గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. భాజపా తరఫున ముగ్గురు ఎమ్మెల్యేలు నామినేట్‌ అయ్యారు. అయితే ఇటీవలే నారాయణస్వామి ప్రభుత్వం కూలిపోవడంతో రాష్ట్రపతి పాలన విధించారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యేల ద్వారా అసెంబ్లీలో ప్రవేశించిన బీజేపీ ఈ సారి అధికారమే లక్ష్యంగా పనిచేస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలను పార్టీలో చేర్చుకుంది.

ఈశాన్య రాష్ట్రమైన అసోంలో తొలిసారి బీజేపీ గత ఎన్నికల్లో సత్తా చాటింది. మొత్తం 126 సీట్లకు గానూ 89 చోట్ల పోటీ చేసి 60 సీట్లు సాధించింది. ఏజీపీ, బీపీఎఫ్‌ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ కేవలం 26 సీట్లకు పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. మళ్లీ ఇక్కడ అధికారం నిలుపుకోవడానికి కమలం పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. ముఖ్యంగా అసోంలో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు.. పశ్చిమ బెంగాల్‌లో రాణించడం ఆ పార్టీకి ముఖ్యం. ఒకవేళ ఈ రెండు చోట్లా ఓడితే కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత అనే ముద్ర పడుతుంది. ప్రస్తుతం ఒకే ఒక్క రాష్ట్రానికి పరిమితమైన సీపీఎంకు కేరళ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. ఇప్పటికే బెంగాల్‌, త్రిపురలో అధికారానికి దూరమై ప్రాభవం కోల్పోయిన ఆ పార్టీకి ఈ ఎన్నికలు సవాల్‌తో కూడుకున్నవే. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీకి కొంత ఊరటనిస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నదే. అయితే, పశ్చిమబెంగాల్‌, తమిళనాడులో ఆ పార్టీ బలం దారుణంగా పడిపోయింది. ఇక కేరళలో లెఫ్ట్‌ను ఓడించడం కొద్దిగా కష్టంతో కూడుకున్న వ్యవహారమే. ఇక అసోంలో సీఏఏ, పుదుచ్చేరిలో సానుభూతితో అధికారంలోకి రావాలని చూస్తోంది. ఇక ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన తృణమూల్‌, అన్నా డీఎంకే ప్రభుత్వ వ్యతిరేకతను దాటుకుని మళ్లీ అధికారం చేపట్టడం అంత సులువేమీ కాదు. మరి ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మే2 వరకు వేచి చూడాల్సిందే



Tags

Read MoreRead Less
Next Story