ద్వేషం, అసహనం నిండిన మీ నవభారతం మాకొద్దు : గులాంనబీ ఆజాద్
జార్ఖాండ్లో జై శ్రీరాం అనాలంటూ ఓ ముస్లిం యువకుడిని తీవ్రంగా కొట్టడంతో అతను చనిపోయిన ఘటనపై పార్లమెంట్ దద్దరిల్లింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్సభలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.... కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు. ఇలాంటి ఘటనలు దేశానికి మంచివి కాదన్నారు. మనుషుల మధ్య శత్రుత్వాన్ని ఎందుకు పెంచుతున్నారంటూ ప్రశ్నించారు. దేశాన్ని సూపర్ పవర్ చేస్తామంటున్న ప్రధాని మోదీ... వీటిని నియంత్రించడం లేదంటూ ఫైర్ అయ్యారు.
అటు..రాజ్యసభలో ఇదే అంశాన్ని సభ ముందుకు తీసుకొచ్చారు కాంగ్రెస్ పక్షనేత గులాంనబీ ఆజాద్. జార్ఖండ్లో మైనార్టీ యువకుడిపై దాడి ఘటనను ప్రస్తావించిన అజాద్... మూకదాడులకు ఆ రాష్ట్రం ఫ్యాక్టరీలా మారిందన్నారు. ఇదేనా న్యూ ఇండియా అంటూ కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని చెబుతున్న సబ్కా సాథ్ సబ్ కా వికాస్ ఎక్కడా కనిపించడంలేదన్నారు అజాద్.
ద్వేషం, అసహనం నిండిన మీ నవభారతం తమకొద్దన్నారు గులాంనబీ ఆజాద్. ఒకరినొకరు శత్రువులుగా చూసుకునే నవభారతం..... ప్రభుత్వం దగ్గరే ఉంచుకుని, ప్రేమ, సంస్కృతికి ఆలవాలమైన ప్రాచీన భారతం తమకు ఇవ్వాలని కోరారు.దళితులు, ముస్లింల చావులు లేని వారం ఉండటం లేదన్నారు. కేంద్రం పదేపదే చెబుతున్నన్యూఇండియా ఇదేనా అని ప్రశ్నించారు ఆజాద్.
పార్లమెంట్ ఉభయసభల్లోనూ....విపక్షాలు జార్ఖండ్ ఘటనను ప్రస్తావించడంలో సక్సెస్ అయ్యాయి. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నదే ఇప్పుడు ప్రశ్నార్థంగా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com