కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని నిలిపివేస్తాం : రాహుల్ గాంధీ
అసోంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా డిబ్రుగర్లో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన రాహుల్.. మోదీ సర్కారు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. ఉద్యోగాలు లేక యువత, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ఉద్యోగాల భర్తీ చేపట్టిందా అని ప్రశ్నించారు. దేశంలో ఉన్న ఒక్కొక్క ప్రభుత్వ రంగాలను మోదీ కార్పొరేట్లకు అమ్మేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని నిలిపివేస్తామని హామీ ఇచ్చారు. సీఏఏతో పాటు నూతన సాగు చట్టాలపై నిరసనలను కూడా ఈ సందర్భంగా రాహుల్ ప్రస్తావించారు.
నాగ్పూర్ నుంచి ఓ శక్తి దేశాన్ని నియంత్రిస్తోందని పరోక్షంగా ఆరెస్సెస్పై ధ్వజమెత్తారు. అసోం రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్న రాహుల్ గాంధీ.. వచ్చే ఎన్నికల్లో బిజెపికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com