వ్యాక్సిన్ ఎగుమతి ముమ్మరం చేసిన ఇండియా

వ్యాక్సిన్ ఎగుమతి ముమ్మరం చేసిన ఇండియా
కరోనా వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది కేంద్రం.

స్వదేశంలో అనుమతి పొందిన కరోనా వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది కేంద్రం. ఈ మేరకు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, మొరాకో, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ దేశాలకు ముందస్తు ఒప్పందాల ప్రకారం వ్యాక్సిన్‌ సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. భూటాన్‌కు లక్షా 50వేల డోసులు, మాల్దీవులకు లక్ష, బంగ్లాదేశ్‌కు 20 లక్షలు, నేపాల్‌కు పది లక్షలు, మయన్మార్‌కు 15లక్షలు, సెచెల్లీస్‌కు 50వేల చొప్పున కొవిషీల్డ్‌ డోసులను సరఫరా చేసినట్లు వెల్లడించింది.

బ్రెజిల్‌, మొరాకో దేశాలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం వ్యాక్సిన్‌లను పంపించామని, నియంత్రణ సంస్థల నుంచి అనుమతి వచ్చిన తర్వాత శ్రీలంక, అఫ్ఘానిస్థాన్‌లకు కూడా సరఫరా చేస్తామన్నారు. పాకిస్థాన్‌కు వ్యాక్సిన్‌ సరఫరా చేస్తారా అనే ప్రశ్నకు సమాధానం దాటవేశారు విదేశాంగ కార్యదర్శి. ఓవైపు దేశ అవసరాలను అనుగుణంగా వ్యాక్సిన్‌లను నిల్వ చేసుకుంటూనే, విదేశాలకు ఎగుమతి కొనసాగిస్తామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.

మరోవైపు... భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ తుది దశ ప్రయోగాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా 25వేల 800 మందికి ప్రయోగ టీకా అందించగా, వీరిలో 13వేల మందికి రెండో డోసు ఇచ్చినట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్ల ట్విటర్‌లో వెల్లడించారు. తొలి రెండు దశ ప్రయోగాల్లో కొవాగ్జిన్‌ మెరుగైన ఫలితాలను నమోదు చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడుతుందని లాన్సెట్‌ నివేదిక వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story