చైనాకు భారత్ మళ్లీ ఝలక్!

చైనాకు భారత్ మళ్లీ ఝలక్!

చైనాకు భారత్ మళ్లీ ఝలక్ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన మరికొన్నిఅప్లికేషన్లను బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా బ్యాన్ చేసిన యాప్స్‌లో చైనా వ్యాపార దిగ్గజ సంస్థ అలీ ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది. దానితో పాటు అలీబాబా వర్క్ బెంచ్, హీరోస్ ఎవాల్వ్‌డ్, డింగ్ టాక్ వంటి ఇతర అప్లికేషన్లున్నాయి.

దేశ సమగ్రతకు భద్రతకు ముప్పు అంటూ ఇప్పటికే భారీగా చైనా యాప్‌లపై వేటు వేసిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో 43 చైనా మొబైల్ యాప్‌లను తాజాగా నిషేధించింది. మాంగో టీవీ, అలీసప్లయర్స్ మొబైల్ యాప్, అలీబాబా వర్క్‌బెంచ్ ,క్యామ్‌కార్డ్, అలీఎక్స్‌ప్రెస్ లాంటివి ఇందులో ఉన్నాయి. చైనీస్ ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబాకు ఇది పెద్ద ఎదురు దెబ్బగా భావించవచ్చు. ఐటీ సెక్షన్ 69ఏ ప్రకారం ఈ బ్యాన్ విధించినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ బ్యాన్ విధించడానికి గల కారణాలను కేంద్రం వెల్లడించింది. భారత సమగ్రతకు, సార్వభౌమాధికారానికి భంగం కలిగే అవకాశం ఉందని, అలాగే రక్షణరంగ, కేంద్ర-రాష్ట్ర ప్రజల భద్రత దృష్ట్యా ఈ అప్లికేషన్లను బ్యాన్ చేసినట్లు తెలిపింది.

ఇప్పటికే చైనాకు చెందిన వందకు పైగా మొబైల్ అప్లికేషన్లను కేంద్ర సర్కార్ బ్యాన్ చేసింది. తొలిసారి యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్, షేర్ ఇట్, క్యామ్ స్కానర్ వంటి 59 యాప్స్‌పై కేంద్ర బ్యాన్ విధించింది. ఆ తరువాత రెండో విడతగా పాపులర్ గేమ్ పబ్‌జీతో సహా మొత్తం 118 యాప్స్‌ను బ్యాన్ చేసింది. ఇక ఇప్పుడు మరో 43 యాప్స్‌ను బ్యాన్ చేసింది. ఈ సారి బ్యాన్ చేసిన యాప్స్‌లో కొద్ది సంఖ్యలో ఇతర దేశాలకు చెందిన యాప్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా వీటిలో అత్యధికంగా డేటింగ్ యాప్స్ ఉన్నాయి. తాజా బ్యాన్‌తో మొత్తం ఇండియా బ్యాన్ చేసిన చైనీస్ అప్లికేషన్ల సంఖ్య 200 దాటేసింది.

తూర్పు లడఖ్‌లోని దేశసరిహద్దు ప్రాంతం వద్ద చైనా దుశ్చర్య, ఉద్రిక్తతల మధ్య పలు యాప్‌లపై కొరడా ఝళిపించింది. ఈ ఏడాది జూన్‌ 29న 59 యాప్‌లను, సెప్టెంబర్ 2న మరో 118 చైనా యాప్‌లను నిషేధించింది. వీటిలో ప్రముఖ చైనాయాప్‌లు టిక్‌టాక్, షేర్‌ఇట్‌, హెలో, షెయిన్, లైక్, వీచాట్, యుసి బ్రౌజర్‌ లాంటివి ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story