పెద్దలు కలిసి బతకనివ్వట్లేదని.. రెండు ప్రేమ జంటలు..

పెద్దలు కలిసి బతకనివ్వట్లేదని.. రెండు ప్రేమ జంటలు..
కలిసి కాపురం చేయనివ్వరని కలిసి మృత్యువును కౌగిలించుకుంటున్నారు. నూరేళ్ల జీవితానికి మధ్యలోనే విషాదగీతిక ఆలపిస్తున్నారు.

ఆత్మహత్యే తమ సమస్యకు పరిష్కారమనుకుంటున్నారు. పెద్దలను ఎదిరించలేని తమ ప్రేమకు మరణంతోనే ముగింపు పలుకుతున్నారు. ప్రేమించేటప్పుడు ఉన్న ధైర్యం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడానికి ఆ ధైర్యం సరిపోవట్లేదు. కలిసి కాపురం చేయనివ్వరని కలిసి మృత్యువును కౌగిలించుకుంటున్నారు. నూరేళ్ల జీవితానికి మధ్యలోనే విషాదగీతిక ఆలపిస్తున్నారు. పెద్దలను ఎదిరించలేని రెండు ప్రేమజంటలు బలవన్మరణానికి పాల్పడిన విషాద సంఘటనలు వెలుగు చూశాయి.

వరంగల్ నగర శివారు నక్కలపల్లి గ్రామంలో బావిలో దూకి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు, మహబూబ్ నగర్ జిల్లాలో పురుగుల మందు తాగి మరో జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఖిలా వరంగల్ మండలం నక్కల పల్లి గ్రామానికి చెందిన మన్నె సాయికుమార్ (23), సిద్దిపేట జిల్లా బస్వాపుర గ్రామానికి చెందిన అశ్విని (19) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. సాయికుమార్ దిల్లీలో, అశ్విని హన్మకొండలో బీటెక్ చదువుతున్నారు.

వీరి ప్రేమ వ్యవహారం కుటుంబసభ్యులకు తెలిసి చాలా సార్లు సాయికుమార్‌తో గొడవ పడ్డారు. పెద్దలు తమ ప్రేమను ఎప్పటికీ అంగీకరించరని భావించిన సాయికుమార్ గురువారం స్నేహితుడి బైక్ తీసుకుని బస్వాపూర్ నుంచి అశ్వినిని వరంగల్ తీసుకు వచ్చాడు. అదేరోజు రాత్రి ఇద్దరి చేతులను చున్నీతో కట్టుకుని నక్కలపల్లి శివారులోని వ్యవసాయ క్షేత్రంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటన స్థలం వద్ద పుస్తెలు లభించడంతో ఇరువురూ వివాహం చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అమ్మను బాగా చూసుకో అంటూ సాయికుమార్ సోదరునికి చివరి మెసేజ్ పెట్టాడు.

మరో ఘటన.. నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (16) మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ఉప్పరి శేఖర్ (23) మధ్య ప్రేమ పరిచయంగా మారింది. వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలిసి ఇద్దరినీ మందలించారు. పైగా ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో పెద్దలు తమ పెళ్లికి అంగీకరించరని భావించారు. ఈ నెల 15న ఊరి నుంచి వెళ్లిపోయారు. కుటుంబసభ్యులు రెండ్రోజులు వెతికినా ఆచూకీ లభించలేదు. చివరకు ఉంద్యాల సమీపంలోని పొలంలో పత్తి కూలీలకు ద్విచక్ర వాహనంతో పాటు ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. పురుగు మందు తాగి ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story