మహానుభావుడు.. అమరావతి ఏటీఎం సెంటర్లో జ్యూస్ షాప్ పెట్టేశాడు.. మరి అయ్యవార్లు ఏం చేస్తున్నారో..
భద్రత దృష్టా ఏర్పాటు చేసిన సెక్యూరిటీ కూడా ఏటీఎం సెంటర్లో బయటే కూర్చుంటాడు.. అలాంటిది ఏటీఎం సెంటర్లో ఏకంగా జ్యూస్ దుకాణాన్ని ఓపెన్ చేసి కస్టమర్ల కోసం ఓ పది కుర్చీలు కూడా ఏర్పాటు చేశాడు మహరాష్ట్రలోని అమరావతికి చెందిన ఓ వ్యక్తి.. ఎండాకాలం ఎక్కడెక్కడో తిరిగొచ్చి ఏటీఎం సెంటర్లో ఏసీ ఉంటుందని హాయిగా పడుకునే వాళ్లని చూశాం కానీ ఎక్కడా ఇలా దుకాణం పెట్టిన వాళ్లని ఇంతవరకు చూడలేదు.
అందుకే కదా వార్త అయింది.. నెలల తరబడి ఏటీఎం సెంటర్లో జ్యూస్ షాప్ నడుస్తున్నా అధికారులకు సమాచారం అందకపోవడం ఆశ్చర్యం. అడుగడుగునా సీసీ కెమెరాలు ఉన్నా దొంగలు ఏటీఎంలో ఉన్న డబ్బుతో పాటు మిషన్లు కూడా దోచుకుపోతున్నారు. సెక్యూరిటీ గార్డుని ఇంటికి పంపించి, సీసీకెమెరాని కవర్ చేసి కస్టమర్లకు కూల్గా జ్యూస్ గ్లాస్ అందిస్తుండే సరికి వాళ్లు కూడా ఇదేదో బానే ఉందని అధికారులకు చెప్పాలనుకోలేదేమో.. అందుకే ఆయన ఆటలు సాగుతున్నాయి కాబోలు అని అనుకుంటున్నారు స్థానికులు.
ఏటీఎం లావాదేవీలు ఎవరికీ తెలియనివ్వకండని బ్యాంకులు మొత్తుకుంటున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు.. ఆనక అకౌంట్లో నగదు మాయం అయ్యాక తీరిగ్గా బాధపడుతుంటారు.. బ్యాంకు వాళ్లని నిందిస్తుంటారు.. మరి ఈ జ్యూస్ షాప్ యజమాని అలాంటి వాడు కాకపోయినా ఏమో ఎవరు చెప్పగలరు.. ఎవరు ఏ టైమ్కి ఎలా మారతారో.. అందుకే ఓ వినియోగదారుడు చూస్తూ ఊరుకోలేకపోయాడు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి ఆ జ్యూస్ సెంటర్ కం ఏటిఎం సెంటర్ని చిత్రీకరించి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్గా మారింది. ఇప్పటికైనా ఆ వీడియో చూసి బ్యాంకు అధికారులు స్పందిస్తారో లేదో.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com