Omicron India: ఒక్కరోజే మూడు రాష్ట్రాలలో ఒమిక్రాన్ కేసు నమోదు..

Omicron India (tv5news.in)

Omicron India (tv5news.in)

Omicron India: భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కలకలం సృష్టిస్తోంది.

Omicron India: భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కలకలం సృష్టిస్తోంది. కరోనా నుంచి కాస్తా కుదుటపడ్డామనుకున్న తరుణంలో..కొత్త వేరియంట్ వణుకు పుట్టిస్తోంది. దేశంలో ఇప్పటివరకు 37 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో అత్యధికంగా 18 కేసులతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పెరుగుతున్న కేసులతో..కేంద్రం రాష్ట్రాలను అలర్ట్ చేసింది.

ప్రపంచదేశాల్లో వణుకుపుట్టిస్తోన్న ఒమిక్రాన్ వైరస్..భారత్‌లోనూ తన ప్రతాపం చూపిస్తోంది. దేశంలో అంతకంతకూ పెరుగుతూ వేరియంట్‌ కేసులు 37కు చేరాయి.తాజాగా ఛండీగఢ్, ఏపీ, నాగ్‌పూర్‌లో తొలి కేసు వెలుగులోకి రాగా..కర్ణాటకలో మూడో కేసు బయటపడింది. రాష్ట్రాలకు క్రమంగా విస్తరిస్తుండటంతో.. అలర్ట్‌ అయిన కేంద్రం ఎయిర్‌పోర్టులలో విదేశీ ప్రయాణికులపై నిఘా పెంచి స్క్రీనింగ్‌ టెస్టులు ముమ్మరం చేసింది.

అటు కొత్త వేరియంట్‌ మహారాష్ట్రను కలవరపెడుతోంది.18 ఒమిక్రాన్ కేసులతో దేశంలో మహారాష్ట్ర ముందువరుసలో ఉంది. నాగ్‌పూర్‌లో ఒమిక్రాన్ ​తొలికేసు నమోదైంది. పశ్చిమ ఆఫ్రికా నుంచి వచ్చిన 40 ఏళ్ల వ్యక్తి శాంపిల్స్‌ను ..జినోమ్​సీక్వెన్సింగ్‌కు పంపించగా ఒమిక్రాన్​ ​నిర్ధరణ అయింది. ఆయన్ను కలిసిన వారందరికీ నెగెటివ్​వచ్చినట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు కర్ణాటకలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఇవాళ మూడో కేసు నమోదైంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు తెలిపిన అధికారులు.. బాధితుడిని ఐసోలేషన్​లో ఉంచినట్లు వెల్లడించారు. ప్రైమరీ కాంట్రక్ట్‌లను గుర్తిస్తున్నట్లు స్పష్టం చేశారు. అటు ఇటలీ నుంచి ఛండీగఢ్‌కు వచ్చిన 20 ఏళ్ల యువకుడిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ నిర్ధరణ అయినట్లు వైద్యారోగ్యశాఖ సిబ్బంది వెల్లడించారు.

ఛండీగఢ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు ఇదే అయినా.. బాధితుడు వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్లు తెలిపారు. అటు ఏపీలోనూ తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. ఐర్లాండ్‌ నుంచి ముంబయి మీదుగా విశాఖపట్నం చేరుకున్న.. విజయనగరం జిల్లా ప్రయాణికునిలో ఒమిక్రాన్‌ గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

తొలుత ముంబయి ఎయిర్‌పోర్టులో RT-PCR పరీక్ష చేయగా.. కొవిడ్‌ నెగెటివ్‌ తేలినట్లు..అక్కడి నుంచి విశాఖకు వచ్చిన అనంతరం విజయనగరంలో మళ్లీ పరీక్ష నిర్వహించారు. రెండోసారి చేసిన కరోనా నిర్ధరణ పరీక్షలో కొవిడ్ పాజిటివ్ తేలింది. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం శాంపిల్స్‌ను హైదరాబాద్‌ సీసీఎంబీకి పంపించారు. ప్రయోగశాల విశ్లేషణలో ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా గుర్తించారు. ఒమిక్రాన్ పాజిటివ్​గా తేలిన వ్యక్తిలో ఎలాంటి లక్షణాలూ కనిపించ లేవని ఏపీ వైద్యశాఖ పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story