పూరి సెట్ చేసిన పాత్రను పవన్ మార్చేసి..
పూరీ జగన్నాథ్ దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకున్న మొదటి చిత్రం బద్రి. ఈ చిత్రం వచ్చి 20 ఏళ్లైనా పవన్ కళ్యాణ్ అభిమానులను ఇప్పటికీ అలరిస్తుంది. అమీషా పటేల్, రేణూదేశాయ్ లను వెండి తెరకు ఈ చిత్రం ద్వారానే పరిచయం చేశారు పూరి. పవన్ కళ్యాణ్ తో సంగీత దర్శకుడు రమణ గోగుల రెండవ సారి జతకట్టిన చిత్రం బద్రి. పవన్ 'తమ్ముడు' చిత్రానికి కూడా ఆయనే సంగీతం అందించారు. ఇన్ స్టా వేదికగా పూరీ.. రేణూ దేశాయ్ తో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ సినిమాలో వెన్నెలగా రేణు దేశాయ్.. సరయూ పాత్రలో అమీషా పటేల్ అలరించారు. అయితే తొలుత సరయూ పాత్ర కోసం రేణు దేశాయ్ ను ఎంపిక చేశారట. కానీ సెట్స్ మీదకు వెళ్లాక చిత్రీకరణ సమయంలో రేణూలోని కొంటెతనం, ఆమె వ్యక్తిత్వం గమనించిన పవన్.. వెన్నెల పాత్రకు రేణూ అయితే బాగుంటుందని పూరీకి సూచించారు. దాంతో పూరీ కూడా పవన్ అభిప్రాయంతో ఏకీభవించి పాత్రలను మార్చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద విజయాన్ని సాధించిన బద్రి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ రొమాంటిక్ డ్రామాను తరువాత హిందీలో షార్ట్: ది ఛాలెంజ్ పేరుతో బాలీవుడ్ లో తెరకెక్కించారు. తుషార్ కపూర్, గ్రేసీ సింగ్, అమృత అరోరా, ప్రకాష్ రాజ్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో తెరకెక్కించారు. బాలీవుడ్ లో కూడా బద్రి ఘన విజయం సాధించింది. అను మాలిక్ స్వరపరిచిన సంగీతం బాగా ప్రాచుర్యం పొందింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com