ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిపివేత

ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిపివేత
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తపోవన్‌ విద్యుత్తు కేంద్రం సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు చమోలీ జిల్లా మెజిస్ట్రేట్‌ బదౌరియా తెలిపారు.

ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేశారు. ధౌలీగంగా నదిలో నీటి మట్టం పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది వెనక్కి వచ్చేశారు. యంత్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ పరిసర గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తపోవన్‌ విద్యుత్తు కేంద్రం సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు చమోలీ జిల్లా మెజిస్ట్రేట్‌ బదౌరియా తెలిపారు.

తపోవన్ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికుల కోసం నాలుగు రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సొరంగం లోపల భద్రతా సిబ్బంది భారీ యంత్రాల సాయంతో పనులు నిర్వహిస్తున్నారు. సొరంగం లోపలికి వెళ్లేందుకు కుదరకపోవడంతో.. అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సొరంగానికి పైభాగం నుంచి డ్రిల్లింగ్ మొదలుపెట్టారు. ఇందుకోసం భారీ యంత్రాలను ఉపయోగిస్తున్నారు. అయితే నీటిమట్టం పెరగడంతో రెస్క్యూ ఆపరేషన్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.

తపోవన్ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన ఈ సొరంగంలో 25 నుంచి 35 మంది కార్మికులు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. సొరంగంలో భారీగా బురద, మట్టి కూరుకుపోయింది. పూడుకుపోయిన మట్టికే రంధ్రాలు చేసి కార్మికులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. 1500 మీటర్ల పొడవు గల ఈ సొరంగంలో ఇంతవరకు 120 మీటర్ల మేర పూడిక తీయగలిగారు.


Tags

Read MoreRead Less
Next Story