Yogi Adityanath : మొదటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం..!
Yogi Adityanath : శనివారం జరిగిన ఉత్తరప్రదేశ్ మొదటి క్యాబినెట్ మీటింగ్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉచిత రేషన్ పథకాన్ని మరో మూడు నెలల పాటు అంటే జూన్ 30, 2022 వరకు పొడిగించాలని నిర్ణయించినట్లు సీఎం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. శుక్రవారం(మార్చి 25)న రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తీసుకున్న తొలి నిర్ణయం ఇదే కావడం విశేషం.
ఉచిత రేషన్ పథకాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించడం వల్ల రాష్ట్రంలోని 15 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని సీఎం యోగి చెప్పారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ. 3,270 కోట్లు ఖర్చు చేస్తుందని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రారంభించిన ఉచిత రేషన్ పథకం గడువు ఈ మార్చి నెలతో ముగియాల్సి ఉంది. ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి నెలకు ఐదు కిలోల రేషన్ అదనంగా లభిస్తుంది. 2020లో కరోనా మహమ్మారి వచ్చినప్పుడు కేంద్రం దీనిని మొదటిసారిగా అమలు చేసింది.
ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ మార్చి 25, శుక్రవారం వరుసగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆనందీబెన్ పటేల్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పూర్తయిన తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన మొదటి ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. ఉత్తరప్రదేశ్ ఉపముఖ్యమంత్రులుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేపీ మౌర్య ఓడిపోయినప్పటికీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతుండగా, దినేష్ శర్మ స్థానంలో బ్రజేష్ పాఠక్ను నియమించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com