Afghanistan: బాంబు దాడులతో దద్దరిల్లిన ఆఫ్ఘనిస్తాన్..
Afghanistan: కొన్నాళ్ల క్రితం వరకు ఆఫ్ఘనిస్తాన్ ప్రజల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. ఇప్పుడిప్పుడే ఉగ్రదాడులు తగ్గిపోయి పరిస్థితి అంతా మామూలుగా అవుతోంది అనుకున్నారంతా. కానీ మళ్లీ ఆ దేశం ఒక్కసారిగా బాంబు దాడులతో దద్దరిల్లింది. శుక్రవారం నమాజ్ సమయమే టార్గెట్గా ఉగ్రవాదులు మసీదుపై బాంబుదాడి చేశారు. దీంతో మళ్లీ ప్రజలలో భయాందోళనలు మొదలయ్యాయి.
ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లో కుందుజ్లోని మసీదులో శుక్రవారం యధావిథిగా ముస్లింలంతా ప్రార్థన కోసం చేరుకున్నారు. అదే సరైన సమయం అనుకొని ఉగ్రవాదులు బాంబు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 33 మంది మరణించినట్టు సమాచారం. ఇందులో కొందరు చిన్నారులు కూడా ఉన్నారు. వీరితో పాటు 43 మంది గాయాలపాలయ్యారు. అయితే ఇందులో ఉగ్రవాదుల హస్తం ఉందో లేదో అధికారులు ఇంకా పూర్తిగా తేల్చలేదు.
కుందుజ్తో పాటు మరోచోట కూడా బాంబు దాడి జరిగింది. ఉత్తర మజర్-ఇ-షరీఫ్లోని మసీదుపై కూడా ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు. ఇందులో కూడా మృతుల సంఖ్య పదికి చేరింది. మరో 10 మంది గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు కైవసం చేసుకున్న తర్వాత ఇవే అతిపెద్ద బాంబు దాడులు. దీంతో మరోసారి ఆఫ్ఘనిస్తాన్లో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com