పరిషత్ ఫలితాలు నేడే..12 గం. తర్వాతే..
తెలంగాణలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 123 కేంద్రాల్లో ఇవాళ లెక్కింపు జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది ఈసీ.
తెలంగాణ ప్రాదేశిక నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు కౌంట్ చేస్తారు. తర్వాత మొత్తం 536 స్ట్రాంగ్ రూంల్లో భద్రపర్చిన బ్యాలెట్ బాక్స్లను లెక్కింపు కేంద్రాలకు తీసుకు వచ్చి కౌంట్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 123 కౌంటింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ పేపర్లు లెక్కించనున్నారు…..
:ముందుగా ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ ఓట్లు లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. ఒక రౌండ్లో వెయ్యి ఓట్లు లెక్కించనుండగా.. ఒక్కో స్థానానికి రెండు రౌండ్లు ఏర్పాటు చేశారు. మొత్తం 978 కౌంటింగ్ హాళ్లను ఏర్పాటు చేయగా.. 11,882 మంది సూపర్వైజర్లు, 23,647 మంది అసిస్టెంట్లను నియమించారు. సాయంత్రం 5 వరకు లెక్కింపు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం నుంచే ఫలితాలు తెలిసే అవకాశం ఉంది. లెక్కింపు సందర్భంగా అవాంచనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు.. మద్యం దుకాణాలు మూసి వేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 8 గంటలకు లెక్కింపును ప్రారంభిస్తారు. ముందుగా ఎంపీటీసీ స్థానాల్లో ఓట్లను లెక్కించి, ఆ తర్వాత జెడ్పీటీసీ ఓట్లను లెక్కించేలా ఏర్పాట్లు చేశారు. అయితే 12 తర్వాతే బ్యాలెట్ పత్రాలను లెక్కించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
గత నెల 6, 10, 14 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. మూడు విడతల్లో మొత్తం 5 వేల 817 ఎంపీటీసీ స్థానాలు, 5వందల 38 జెడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా.. 4 జెడ్పీటీసీలు, 158 ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. 534 జెడ్పీటీసీ, 5 వేల 659 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రాదేశిక సమరంలో కోటీ 20 లక్షల 86 వేల 385 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు…
ఓట్ల లెక్కింపును మే 27న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావించినా.. సాంకేతిక కారణాలతో వాయిదా వేసింది. జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు 42 రోజుల సమయం ఉండటం, క్యాంపులతో ప్రలోభాలకు గురిచేసే అవకాశాలున్నాయనే ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ఈ నెల 8న, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక ఈ నెల 7న నిర్వహించేందుకు ఎస్ఈసీ నోటిఫికేషన్, షెడ్యూల్ జారీ చేసింది
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com