సొంత నియోజకవర్గంపై ఫోకస్‌ తగ్గించని కిషన్‌ రెడ్డి

సొంత నియోజకవర్గంపై ఫోకస్‌ తగ్గించని కిషన్‌ రెడ్డి

కేంద్రమంత్రి అయినా సొంత నియోజకవర్గంపై ఏ మాత్రం ఫోకస్‌ తగ్గించడం లేదు కిషన్‌ రెడ్డి. హైదరాబాద్‌ నగరంలో మరోసారి పర్యటించిన కిషన్‌రెడ్డి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఖైర‌తాబాద్ నియోజక వ‌ర్గంలోని ఇందిరాన‌గ‌ర్ లో ఆయ‌న ప‌ర్య‌టించారు. త‌న గెలుపునకు కృషి చేసిన వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. దేశంలో ఉగ్ర‌వాద నిర్మూలన‌లో ఎన్ఐఏ కీలక పాత్ర పోశిస్తుంద‌ని కిష‌న్ రెడ్డి తెలిపారు. ప్ర‌స్తుతం ఉన్న చ‌ట్టాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకే కొత్త చట్టం తీసుకు వ‌చ్చిన‌ట్టు ఆయ‌న తెలిపారు...

అనంతరం కేశవ్‌ మెమోరియల్‌ సొసైటీ 79వ వార్షికోత్స‌వా‌ల్లో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. నిజాం హయాంలో నిర్భందాల‌ను ఎదుర్కొని వెంక‌ట‌రామి రెడ్డి, భాగ్యరెడ్డి వ‌ర్మ‌ లాంటి మ‌హనీయులు పేద‌వారి కోసం విద్యా సంస్థ‌లు ఏర్పాటు చేశారని కొనియాడారు. విద్యలో నూతన విధానం తీసుకొచ్చే దిశగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు..

ఇక అటు కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పైనా కిషన్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. మతం గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు లేదన్నారు. ఓవైసీ సోదరులను చెరో వైపు కూర్చోబెట్టుకునే కేసీఆర్‌.. బీజేపీ పై విమర్శలు చేయడమేంటని మండిపడ్డారు. బీజేపీ ఎప్పుడూ మత రాజకీయాలు చేయలేదని... ప్రజల సమగ్ర అభివృద్ధే తమ ఎజెండా అని స్పష్టం చేశారు. కారు, సారు, పదహారు లాంటి నినాదాలేవీ పని చేయడం లేదని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు..

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తాను.. మహిళల భద్రతకు పెద్దపీట వేసేందుకు కృషి చేస్తానని కిషన్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపేందుకు మోదీ సర్కారు పనిచేస్తుందని కిషన్‌ రెడ్డి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story