బీజేపీలో చేరిన టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.. కీలకమైన నేతలను తమవైపు తిప్పుకుంటూ బలాన్ని మరింత పెంచుకుంటోంది.. తాజాగా టీఆర్ఎస్కు గుడ్బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. పార్టీ క్రమశిక్షణ మేరకు నడుచుకుంటానని చెప్పారు.
రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీజేపీలో చేరారు. ఇటీవలే టీఆర్ఎస్కు రాజీనామా చేసిన సోమారపు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, సీనియర్ నేత దత్తాత్రేయ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. సోమారపు సత్యనారాయణతోపాటు పలువురు నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సోమారపు సత్యనారాయణకు రామగుండంలో గట్టి పట్టుంది. ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన సోమారపు సత్యనారాయణ.. టీఆర్ఎస్ వైఖరిపై ఆగ్రహంతో పార్టీకి రాజీనామా చేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని భావించారు. అయితే, ఆయన్ను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్ చర్చలు జరిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సోమారపు ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. సోమారపు సత్యనారాయణను బీజేపీలో చేరేందుకు ఒప్పించారు.
గౌరవం లేని చోట ఉండడం తన స్వభావం కాదన్నారు సోమారపు సత్యనారాయణ. ఆర్టీసీ ఛైర్మన్గా సంస్థను బాగు చేసేందుకు కష్టపడ్డాడడని... సభ్యత్వం విషయంలో తనను దారుణంగా అవమానించారని చెప్పారు. రాజకీయాల నుంచే తప్పుకుందామనుకున్న తరుణంలో బీజేపీలో చేరేందుకు ఎంపీలు ఒప్పించారని సోమారపు తెలిపారు. బైట్.. సోమారపు సత్యనారాయణ
సోమారపు సత్యనారాయణ చేరికతో జిల్లాలో పార్టీ మరింత బలోపేతమవుతుందని... బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. సుదీర్ఘ అనుభవం ఉన్న సత్యనారాయణకు పార్టీలో అన్ని అవకాశాలు కల్పిస్తామని లక్ష్మణ్ భరోసా ఇచ్చారు. ఇక తన శేష జీవితాన్ని బీజేపీలోనే గడుపుతానని సోమారపు సత్యనారాయణ చెప్పారు.. పార్టీ క్రమశిక్షణ మేరకు పనిచేస్తానని, జిల్లాతోపాటు రామగుండంలో పార్టీ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com