జియో ఫైబర్ వార్షిక ప్లాన్‌ తీసుకుంటే ఎల్‌ఈడీ టీవీ, సెట్‌టాప్‌ బాక్స్‌ ఉచితం

జియో ఫైబర్ వార్షిక ప్లాన్‌ తీసుకుంటే ఎల్‌ఈడీ టీవీ, సెట్‌టాప్‌ బాక్స్‌ ఉచితం

ఎన్నో రోజులుగా ఎదురుచూస్తోన్న జియో ఫైబర్‌ సేవలపై సస్పెన్స్‌ వీడింది. వచ్చేనెల 5 నుంచి జియో ఫైబర్‌ సేవలను ప్రారంభించనున్నట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ప్రకటించారు. దీంతో ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్, డీటీహెచ్, ల్యాండ్‌లైన్ సేవలు అతి తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి.

భారతీయ దిగ్గజ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎంతో ప్రెస్టిజియస్‌ తీసుకొస్తున్న జియో పైబర్‌ సేవలు సెప్టెంబర్‌ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం జరిగిన రిలయన్స్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ముఖేష్ అంబానీ... జియో ఫైబర్‌ సేవలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్‌ 5తో జియో లాంఛ్‌ అయి మూడేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా కమర్షియల్‌ బేసిస్‌లో జియో పైబర్‌ సేవలను ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. జియో హోం బ్రాడ్‌బ్యాండ్‌లో భాగంగా సెకనుకు 1జీబీ స్పీడ్‌తో 100 జీబీ ఇంటర్నెట్, ఉచిత ల్యాండ్‌లైన్ సౌకర్యం, వీడియో కాన్ఫరెన్స్, యూహెచ్‌డీ సెటాప్ బాక్స్‌ను అందించనున్నట్లు చెప్పారు. 1600 నగరాల్లోని 2కోట్ల నివాసాలు, 1.5కోట్ల వ్యాపార భవనాలకు జియో ఫైబర్‌ను అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

జియో సెట్‌టాప్‌ బాక్సు ద్వారా ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా కాన్ఫరెన్స్ ద్వారా వీడియో కాల్‌ సేవలు ఉచితంగా చేసుకోవచ్చు. నెలకు 700 నుంచి 10వేల టారిఫ్‌ ప్లాన్‌లో జియో ఫైబర్‌ సేవలు పొందొచ్చు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తామని, 2020 జనవరి 1 నుంచి జియో కమర్షియల్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ సేవలు అందుబాటులోకి వస్తాయని ముఖేష్‌ అంబానీ అన్నారు. జియో గిగా ఫైబర్‌ ద్వారా సోషల్‌ గేమింగ్‌ పేరుతో మల్టిపుల్‌ గేమింగ్‌ సేవలను అందించనున్నట్లు చెప్పారు. అలాగే మిక్స్‌డ్‌ రియాలిటీ పేరుతో సరికొత్త వర్చువల్‌ రియాలిటీ సేవలు అందించనున్నట్టు ఆయన వెల్లడించారు.

లైఫ్‌టైమ్‌ వ్యాలిడిటీతో భారత్‌లోని ఏ టెలికాం ఆపరేటర్‌కైనా జియో ఫైబర్‌ ద్వారా ఇంటి నుంచే ఉచితంగా వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. ప్రీమియం జియో ఫైబర్‌ కస్టమర్లు సినిమా విడుదలైన రోజే తమ ఇంట్లో చూసుకోవచ్చు. ‘జియో ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’గా పిలిచే ఈ సేవలను వచ్చే ఏడాది మధ్యలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రకటించింది. ప్రారంభ ఆఫర్‌ కింద ఫరెవర్ వార్షిక ప్లాన్‌ తీసుకునే జియో ఫైబర్‌ కస్టమర్లకు రిలయన్స్‌ స్పెషల్‌ ఆఫర్‌ను కూడా ప్రకటించింది. ఆఫర్‌లో భాగంగా హెచ్‌డీ లేదా 4కే ఎల్‌ఈడీ టీవీ, సెట్‌టాప్‌ బాక్సును ఉచితంగా అందించనున్నట్టు వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story