కర్ణాటకలో కొత్త మంత్రివర్గ ఏర్పాటుకు రంగం సిద్ధం

కర్ణాటకలో కొత్త మంత్రివర్గ ఏర్పాటుకు రంగం సిద్ధం

కర్ణాటకలో మంత్రివర్గ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. సోమవారం యడియూరప్ప కేబినెట్ కొలువు దీరే అవకాశముంది. కొత్త మంత్రివర్గంలో 18 నుంచి 20 మందిని తీసుకోనున్నారు. లింగాయత్, ఒక్కళిగ, ఎస్సీ-ఎస్టీ, కురుబ, బ్రాహ్మణ, బిల్లవ వర్గాలకు కేబినెట్‌లో చోటు కల్పించనున్నారు. లింగాయత్‌ వర్గానికి 5 మంత్రి పదవులు కేటాయించనున్నారు. మరో ప్రధాన వర్గం ఒక్కళిగలకు 4 కేబినెట్ పోస్టులు లభించ నున్నాయి. ఎస్సీ-ఎస్టీలకు చెరో మూడు మంత్రి పదవులు ఇచ్చే అవకాశముంది. కురుబ, బ్రాహ్మణ, బిల్లవ కులాలకు ఒక్కొక్కటి చొప్పున మంత్రిపదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది.

మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడానికి ఆశావహులు పోటీపడుతున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో కొందరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కేఎస్‌ ఈశ్వరప్ప, ఆర్‌.అశోక్, జగదీశ్‌ శెట్టర్, వి.సోమణ్ణ, గోవింద కారజోళ, జేసీ మాధుస్వామి, బి.శ్రీరాములు, ఉమేశ్‌ కత్తి, డాక్టర్‌ అశ్వర్థనారాయణ్, శశికళా జొల్లె, రేణుకాచార్య, సీటీ రవి, బాలచంద్ర జార్కిహో ళి, శివనేగౌడనాయక్, అంగార, బోపయ్య, కోటా శ్రీనివాసపూజారి, జి.కరుణాకర్‌రెడ్డిలకు తొలివిడతలో మంత్రులుగా అవకాశం ఇస్తారని సమాచారం.

ప్రభుత్వం ఏర్పాటై 3 వారాలు గడుస్తున్నా ఇంకా మంత్రివర్గం జాడే లేదంటూ బీజేపీపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. వీటికి చెక్ పెట్టడంపై కమలదళం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి యడియూరప్ప, కేబినెట్ ఏర్పాటులో తలమునకలయ్యారు. ఇప్పటికే ఓసారి పార్టీ అధినాయకత్వంతో చర్చించిన యడ్డీ, మరోసారి పార్టీ హైకమాండ్‌తో సంప్రదింపులు జరపనున్నారు. మంత్రివర్గంలోకి తీసుకోబోయేవారి పేర్లను శని, ఆదివారాల్లో ఖరారు చేయనున్నారు. తొలి విడతలో 20 మందికి స్థానం కల్పించినా, ఇంకా 13 ఖాళీగా ఉంటాయి. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఆ 13 స్థానాలను కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story