వివాహేతర సంబంధం ఎంతకు దారితీసిందంటే..

వివాహేతర సంబంధం ఎంతకు దారితీసిందంటే..

అక్రమ సంబంధం పచ్చటి కాపురంలో చిచ్చు రేపింది. ఒక వివాహిత దారుణ హత్యకు గురైంది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం పి.వి.పురంకు చెందిన భానును, రాయలచెరువుపేటకు చెందిన గుణశేఖర్‌కి 9 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఆరేళ్ల కూతురు ఉంది. అత్తతో గొడవల కారణంగా తల్లి వద్దే ఉంటోంది భాను. భర్త గుణశేఖర్ మాత్రం భార్య దగ్గరకు తరచూ వస్తూ వెళ్లేవాడు. మరోవైపు స్థానికంగా ఉన్న జేసీబీ డ్రైవర్ హరితో భానుకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

కొన్ని రోజుల తరువాత.. భానుపై హరి వేధింపులు మొదలెట్టాడు. తనతో పాటు తన స్నేహితుల కోర్కెలు తీర్చాలి అంటూ వేధించేవాడు. అందుకు భాను ఒప్పుకోకపోవడంతో... ఇద్దరి మధ్య గొడవలవుతున్నాయి. మే ఏడో తేదీన జాతరలో కలుద్దామని భానుని రమ్మంటే.. ఆమె నమ్మి అన్నాసామి గండి చెరువు దగ్గరకు వెళ్లింది. అప్పటికే స్నేహితులతో కలసి మద్యం సేవించిన హరి భానుపై అత్యాచారయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా జెసిబితో పెద్ద గొయ్యి తవ్వి అందులో పూడ్చేశారు.

భాను కనిపించడం లేదని భర్త గుణశేఖర్‌తో పాటు తల్లి లీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భానుది అదృశ్యం కేసుగా నమోదు చేసిన పోలీసులు.. రెండు నెలల పాటు కాలయాపన చేస్తూ వచ్చారు. తరువాత భానుకి హరితో పరిచయం ఉందని తెలుసుకుని.. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన స్నేహితులతో కలసి భానుపై అత్యాచారం చేసి.. హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. భాను మృతదేహాన్ని బయటకు తీశారు. భాను హత్యకు కారణమైన హరితో పాటు అతడి స్నేహితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story